కలెక్టరేట్ సాక్షిగా మానవత్వం చచ్చిపోయింది: నిర్లక్ష్యానికి ఓ ప్రభుత్వోగిని బలి
హైదరాబాద్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఓ ప్రభుత్వ అధికారిణి రూపంలో మానత్వం చచ్చిపోయింది. హైదరాబాద్ జాయింట్ కలెక్టర్, 15 మంది వైద్యులు, వివిధ శాఖల అధికారులు.. అందరూ ఉన్నా.. ఆ మహిళా అధికారిణిని ఎవరూ పట్టించుకోకపోవడంతో తనువు చాలించింది.
కలెక్టరేట్లో స్పృహతప్పి పడిపోయిన ఆ మహిళను ఆస్పత్రికి చేర్చడానికి బయటనున్న సిబ్బంది, డ్రైవర్లు కూడా ముందుకు రాలేదు. చివరికి ఆమె ఓ అధికారి అని తెలియడంతో కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు హడావుడి చేశారు. అయితే అప్పటికే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ కార్యాలయంలో ఓ ముఖ్యమైన సమీక్ష సమావేశానికి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇంఛార్జీ పీడీ సుకేశిని అనే మహిళా అధికారణి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, బయటకు వచ్చి కుప్పకూలిపోయారు.
ఈ విషయాన్ని వెంటనే అక్కడ సమీక్షలో ఉన్న అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజేందర్, ఇతర ముఖ్య అధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లారు. అయితే వారెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అక్కడే ఉన్న కొంతమంది 108కు ఫోన్ చేసినా అంబులెన్స్ కూడా సమయానికి రాలేదు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు కూడా ఎవ్వరూ స్పందించకపోవడం విచారకరం.
ఈ వ్యవహారమంతా దాదాపు అరగంటపాటు కొనసాగింది. ఇంతలో సుకేశిని ఐసీడీఎస్ అధికారి అని తెలియడంతో హడావిడిగా ఓ కారులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు చెప్పారు. కాగా, ఆమె మృతదేహాన్ని ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు.
ఇదంతా జరిగాక.. అక్కడ జరిగిన సమావేశంలోనే సంబంధిత అధికారులు, ఏజేసీ, ఆమె మృతికి సంతాపం తెలపడం గమనార్హం. ఆమెను సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళితే.. ప్రాణాలు నిలిచి ఉండేవని అక్కడున్న వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓ ప్రభుత్వ ఉద్యోగిని తనువు చాలించాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం సుకేశిని ఐసీడీఎస్ సికింద్రాబాద్ సీడీపీవోగా విధులు నిర్వహిస్తూనే, జిల్లా శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి పీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. సుకేశినికి భర్త, కుమారుడు ఉన్నారు.