ఇంట్లోనే ప్రియుడితో భార్య: ప్రశ్నించినందుకే భర్తను చంపేసింది
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను దారుణంగా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల దర్యాప్తుల నిజం తేలడంతో కటకటాలపాలయ్యారు సదరు మహిళ, ఆమె ప్రియుడు.
హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను దారుణంగా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల దర్యాప్తుల నిజం తేలడంతో కటకటాలపాలయ్యారు సదరు మహిళ, ఆమె ప్రియుడు.
ఏసీపీ గోవర్ధన్ సీఐ పి.భిక్షపతిరావు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్న రమేష్(38), భార్య దేవి, ఇద్దరు కుమారులతో నెహ్రూనగర్లో నివాసం ఉండేవారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఎంటీఏఆర్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్గా పనిచేస్తున్న అమరేందర్(36)తో దేవికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కాగా, వీరి విషయం తెలుసుకున్న రమేష్.. భార్యతో గొడవపడి గాంధీనగర్ సమీపంలోని గురుమూర్తినగర్కు నివాసం మార్చాడు. అయినా అమరేందర్ వచ్చి వెళ్తుండేవాడు. మార్చి 20న సాయంత్రం రమేష్ ఇంటికొచ్చేసరికి అమరేందర్తో దేవి ఉండటాన్ని గమనించి గొడవపడ్డాడు. దీంతో దేవి, అమరేందర్ కలిసి రమేష్ ముఖంపై తలగడ పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.
అర్ధరాత్రి సమయంలో చుట్టుపక్కల వారిని నిద్రలేపి భర్త కదలడంలేదని ఏడుస్తూ ఆమె చెప్పడంతో 108కి ఫోన్ చేయగా వారు వచ్చి మృతి చెందినట్లు ధృవీకరించారు. గుండెపోటుతో మరణించి ఉంటాడని చుట్టు పక్కలవారిని ఏ మార్చింది.
మరుసటి రోజు చింతల్లో ఉండే మృతుడి తల్లి కృష్ణకుమారి కోడలిపై అనుమానం ఉందని అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా విచారించగా దేవి, అమరేందర్ తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిని సోమవారం అరెస్ట్ చేశారు పోలీసులు.