క్షుద్రపూజలు: మహిళపై అత్యాచారం, దారుణ హత్య
రంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్యచేసి ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు.
బషీరాబాద్ మండలం మంతట్టిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.
అనంతరం ఆ మహిళ గొంతుకోసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు. ఈ ఘటన మంతట్టిలో సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగంతకుల కోసం గాలిస్తున్నారు.
హతురాలిని నర్సమ్మ(46)గా గుర్తించారు. కాగా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరును బట్టి క్షుద్రపూజల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్, 60 మంది అరెస్ట్
రాజేంద్రనగర్ చింతల్ మెట్ లో ఆదివారం తెల్లవారుజామునుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. చింతల్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.
తనిఖీలలోభాగంగా అనుమానాస్పదంగా తిరుగతున్న 60 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 40 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో 10 మంది రౌడీషీటర్లు, నలుగురు పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు.