హైదరాబాద్లో పేలుడు: ఓ మహిళ మృతి, ఆమె భర్తకు తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని మైలార్దేవ్పల్లిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఆనంద్ నగర్ పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరిస్తుండగా అక్కడ బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు సుశీలమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబు పేలుడుపై భిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడలోని ఓ చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులు సుశీలమ్మ, ఆమె భర్త ఉదయం ఆటోలో ఆనంద్నగర్ పారిశ్రామిక వాడకు వెళ్లారు. అయితే వారు చెత్త సేకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో సుశీలమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త రంగముని తీవ్ర గాయలపాలయ్యారు. దీంతో స్థానికుల సహాయంతో రంగమునిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసలు తెలిపారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని, పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పేలుడు జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుశీలమ్మ మృతదేహం ఘటన స్థలిలో చిందరవందరగా పడి ఉందని స్థానికులు తెలిపారు. కాగా, వీరిద్దరు ప్రతిరోజు చెత్తను సేకరించి..వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తారు. అందుకే వీరు పారిశ్రామికవాడలోని వ్యర్థాలను సేకరించేందుకు ఆటోలో వచ్చారు.