బైక్ కొనివ్వలేదని.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కాటేదాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతితో ఆ కుటుంబంలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా నగర్ కర్నూలుకు చెందిన నిరంజన్, ఇంద్రమ్మ దంపతులు. ఐదేళ్ల క్రితం కాటేదాన్కు వచ్చిన వీరు పద్మశాలిపురంలో నివాసం ఉంటున్నారు. కాగా, వీరి కుమారుడైన సాయిబాబా(20) బైక్ కొనివ్వాలని కొంతకాలంగా తల్లిదండ్రులను కోరుతున్నాడు.
వారు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన సాయిబాబా ఆదివారం పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరుగు పరుగున ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సాయిబాబా ఉరేసుకుని కనిపించాడు.

చెట్టంత కొడుకు మృతి చెందడాన్ని తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో యువకుడి దారుణ హత్య జరిగింది. పహాడీ షరీఫ్లో ఫరీఖాన్ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరీఖాన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పహాడీ ఫరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications