ఊరి సమస్యల కోసం సీఎంకు లేఖ రాసి ప్రాణత్యాగానికి ప్రయత్నించిన యువకుడు .. ఎక్కడంటే ?
మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. ప్రతి ఊరిలోనూ సమస్యలుంటాయి. అయితే ఎవరికి వారే స్వార్ధంతో మసలుకునే తరుణంలో గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఓ యువకుడు స్పందించాడు. సమస్యలను పరిష్కరించాలి అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా తనవంతు ప్రయత్నం కూడా చేశాడు. తాను పరిష్కరించే స్థాయి సమస్యలు కాకపోవటంతో ప్రభుత్వం మాత్రమే పరిశాక్కారం చెయ్యగల సమస్యలు కావటంతో ఆ యువకుడు ఎలాగైనా సీఎం ఆ గ్రామ సమస్యలపై దృష్టి సారించాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సీఎం కేసీఆర్ కు 17 పేజీల సుదీర్ఘమైన లేఖ రాసి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు.

గ్రామ సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలని ప్రాణాన్ని పణంగా పెట్టిన యువకుడు
ఓ గ్రామ సమస్యలపై ఎలాగైనా సీఎం దృష్టి సారించేటట్లు చేయాలనుకున్న యువకుడు దాని కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టాలని భావించి అతడు ముఖ్యమంత్రికి సుదీర్ఘమైన లేఖ రాసి, అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ రూరల్ జిల్లా నడికూడలో వరంగల్ ఎన్ఐటీలో ఎమ్మెస్సీ (టెక్) ఇంజనీరింగ్ పూర్తి చేసిన బుర్ర నరేశ్గౌడ్ గ్రామంలోని రైతు సమస్యలు పరిష్కరించాలని, నడకూడలో వెయ్యి పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని కోరుతూ మే 19వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే, దీక్షకు అనుమతి లేదని, అందువల్ల చేయొద్దంటూ పరకాల ఎస్సై అడ్డుకున్నారు. దాంతో బుధవారం ఉదయం ముఖ్యమంత్రికి తాను చెప్పదలచుకున్న సమస్యల గురించి వివరిస్తూ 17 పేజీల లేఖ రాశారు.

గ్రామ సమస్యలపై సీఎంకు 17 పేజీల లేఖ రాసిన యువకుడు నరేష్ గౌడ్
ఇక నరేష్ గౌడ్ రాసిన లేఖలో పంటకు ఎక్కువ గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం తప్ప పెద్ద ఆరోగ్య సమస్యలకు ఆపరేషన్లు చేయడం కుదరడం లేదని, అందువల్ల ఎక్కువ శాతం పేదలున్న ప్రాంతాల్లో అన్ని వసతులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు ఆ యువకుడు . నడకూడలో కూడా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ఏర్పడిన మండల కేంద్రాల్లో వెంటనే కార్యాలయాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరాడు. ఆ ఉత్తరాన్ని ఇంట్లో టీవీపై పెట్టి, ఊరిలోని చెరువు దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రాణాపాయ స్థితిలో నరేష్ గౌడ్ .. నరేష్ గౌడ్ బ్రతకాలని కోరుకుంటున్న గ్రామస్తులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేశ్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమస్యల సాధన కోసం నరేష్ గౌడ్ లేఖ రాసి చేసిన ప్రయత్నం మంచిదే కానీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం మాత్రం స్థానికులను ఆవేదనకు గురి చేస్తుంది . ఇంకా నరేష్ గౌడ్ ప్రాణాపాయం నుండి బయటపడలేదని వైద్యులు చెప్తున్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖ రాసిన నరేష్ గౌడ్ ప్రాణాపాయం నుండి బయటపడాలని గ్రామస్తులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications