ఈఎస్ఐ మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్య: ప్రేమ విఫలమే కారణం!
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈఎస్ఐ మెట్రోస్టేషన్ నుంచి కిందకు దూకిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకడంతో తీవ్రగాయాలైన యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలు ఎస్ఆర్ నగర్ పరిధి శ్రీరామ్నగర్ వాసిగా గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విషాదం: పెంట్హౌస్ గోడ కూలి చిన్నారి మృతి
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఓ బిల్డర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలను చిదిమేసింది. ఇంటిపై కొత్తగా నిర్మిస్తున్న ట్యాంక్ గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన సునీల్ హెచ్ఎంటీ హిల్స్ శాతవాహన నగర్లో ఇటీవలే ఓ బేకరీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. తన భార్య మేరీ, నాలుగేళ్ల కూతురు షారొన్ దీత్యలను కూడా గత నెల ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నాడు.
అయితే ఎప్పటిలాగే ఉదయం బేకరి తెరిచిన సునీల్కు.. టిఫిన్ బాక్స్ అందించేందుకు మేరీ తన కూతురితో కలిసి బయలుదేరింది. బేకరి దగ్గరకు రాగానే, పక్కనే ఓ భవనంపై నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి దీత్యపై పడింది. మూడో అంతస్థుపై నుంచి ఒక్కసారిగా ఇటుకలు మీదపడడంతో తలకు తీవ్రగాయాలై దీత్య అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
ఒక్కసారిగా, కళ్ల ఎదుటే బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభించారు. ఈక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారుపోలీసులు.












Click it and Unblock the Notifications