‘ప్రియురాలు మోసం చేసింది, ఆమెను శిక్షించండి’: యువకుడి ఆత్మహత్య
కరీంనగర్: ప్రియురాలు మోసం చేసిందనే మనస్తాపంతో జిల్లాలోని మంథని మండలం చల్లపల్లికి చెందిన దేవేందర్ అనే యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి గ్రామానికి చెందిన రేపాక దేవేందర్, కమాన్పూర్ మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం తెలిసి యువతి బంధువులు దేవేందర్ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆ యువతి ముఖం చాటేయడంతో దేవేందర్ మానసికంగా కుంగిపోయాడు.
ఆదివారం అర్ధరాత్రి తన పత్తిపొలంలో క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు దేవేందర్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవేందర్ వద్ద సూసైడ్నోట్ లభించిందని అందులో ఈ విషయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
యువతి తనను ప్రేమించి మోసం చేసినందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడని పోలీసులు చెప్పారు. అయితే తన ఖర్చుల కోసం కుటుంబసభ్యులు ప్రతినెలా ఇచ్చే రూ.2వేల నగదును ఇకపై అనాధలకు ఇవ్వాలని దేవేందర్ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. తనను మోసం చేసిన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్నోట్లో రాసినట్లు పోలీసులు చెప్పారు.
కాగా, చేతికందిన కొడుకు ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసినప్పటి నుంచి తన కుమారుడు మానసికంగా కుంగిపోయినట్లు మృతుని తండ్రి పోలీసులకు తెలిపారు.