అర్ధరాత్రి కాల్పుల కలకలం: రియల్ఎస్టేట్ వ్యాపారిపై వీపులోకి బుల్లెట్
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఓ యువకుడు కాల్పులు జరిపిన ఘటన బుధవారం రాత్రి పేట్బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
పేట్బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్ కథనం ప్రకారం... బాపూనగర్కు చెందిన నాగేందర్రెడ్డి అనే రియల్ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి సుమారు 10.45 గంటల ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన సాయిప్రభు అలియాస్ తేజ(27) అనే యువకుడు తుపాకితో కాల్పులు జరిపాడు.
తేజ మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒక బుల్లెట్ నాగేందర్రెడ్డి వీపులోకి దిగింది. స్థానికులు నిందితుణ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కాగా, నాగేందర్ రెడ్డిని హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్థిరాస్తి లావాదేవీల వివాదాల నేపథ్యంలో చక్రవర్తి అనే వ్యక్తి తనకు తుపాకీ ఇచ్చి కాల్పులు జరపమని తెలిపినట్లు తేజ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.