ABP-Cvoter Opinion Polls 2023 : తెలంగాణలో కాంగ్రెస్ లీడ్-రెండో స్ధానంలో బీఆర్ఎస్ !
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో ప్రజానాడి ఎలా ఉందన్న అంశంపై ఇవాళ ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ 2023 వెలువడ్డాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ కంటే విపక్ష కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తేలింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా పుంజుకోగా.. అధికార బీఆర్ఎస్ ఆ మేరకు వెనుకబడిపోయింది. మరోవైపు నిన్న మొన్నటి వరకూ అధికారంలో వచ్చేస్తున్నామన్నంతగా హడావిడి చేసిన మరో జాతీయ పార్టీ బీజేపీ ... పూర్తిగా చతికిలపడినట్లు తాజా సర్వే చెబుతోంది.

నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఓట్ల శాతం పెంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.3 శాతం ఓట్లు లభిస్తే ఈసారి 38.8 శాతం ఓట్లు రాబోతున్నట్లు ఈ సర్వే తెలిపింది. అంటే ఏకంగా 10.5 శాతం అధికం. మరోవైపు అధికార బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 43 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి 37.5 శాతానికి పడిపోతున్నట్లు తేలింది. అంటే దాదాపు 9.4 శాతం ఓట్లు కోల్పోతోంది. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 16.3శాతం ఓట్లు సాధించబోతోంది.
అటు సీట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి 48 నుంచి 60 సీట్లు సాధించబోతున్నట్లు ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేసింది. అలాగే అధికార బీఆర్ఎస్ కేవలం 43-55 సీట్లు మాత్రమే సాధిస్తుందని ఈ సర్వే తెలిపింది. బీజేపీ గతంలో సాధించిన 5 సీట్ల స్ధానంలో ఈసారి 11 సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం సహా ఇతరులకు 5 నుంచి 11 సీట్లు లభించే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ వెల్లడించింది.
తాజాగా వెలువడిన పలు సర్వేల్లోనూ బీఆర్ఎస్ వెనుకబడుతోందనే అంచనాలు వచ్చాయి. ఇప్పుడు ఏబీపీ సర్వేలోనూ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ లీడ్ లో ఉందని తేలడంతో అధికార పార్టీ ఈ నెల రోజుల్లో వ్యూహాలు మార్చుకుంటుందా లేక మళ్లీ సెంటిమెంట్ మీదే ఆధారపడుతుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బాగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications