అంతా 'హంబక్'?: పైపై హంగామా తప్ప ఇంకేమి లేదు.., 'ఏసీబీ'పై క్రైమ్ బ్యూరో నిగ్గు తేల్చిందిలా..
హైదరాబాద్: అంతా పైపై హంగామా.. హడావుడికే పరిమితం తప్ప దొంగను బోనెక్కించింది లేదు. కోట్ల కూడబెట్టారని ఊదరగొట్టడం వాళ్ల వంతే.. ఆధారాలు లేవంటూ కేసును మరుగునపర్చడం కూడా వాళ్ల వంతే. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 128కేసుల్లో ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరు ఇది.
ఏసీబీ దర్యాప్తులు ఎక్కడివక్కడే పడకేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. ఆధారాలు లేవన్న కారణంతో 128కేసులను ఇక్కడి ఏసీబీ అధికారులు పక్కనపెట్టేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మొదటి స్థానం:
అవినీతి కేసుల నమోదు, అధికారుల అరెస్ట్ తదితర వ్యవహారాల్లో 12వ స్థానంలో ఉన్నా.. ఆధారల్లేవన్న కారణంతో కేసులు మూసివేసిన విషయంలోను తెలంగాణ టాప్ లో నిలిచింది. ఒక్క 2016సంవత్సరంలోనే ఏకంగా 125కేసులను ఆధారాల్లేవన్న కారణంతో ఏసీబీ మూసివేసినట్లు తెలిపింది.
ఏసీబీ, విజిలెన్స్ ఫెయిల్యూర్:
తనిఖీల విషయంలో చురుగ్గా ఉంటున్న ఏసీబీ.. చార్జీషీట్ల దశకు వచ్చేసరికి మాత్రం కేసులనే మూసివేస్తోంది. గడిచిన మూడేళ్లలో ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు నమోదు చేసిన కేసుల్లో 125కేసులు ఇదే తరహాలో మూతపడ్డట్లు ఎన్సీఆర్బీ తెలిపింది.
అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద మూడేళ్లలో 421 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఇంకా 295కేసులు దర్యాప్తులోనే ఉన్నాయి. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. కానీ ఏసీబీ, విజిలెన్స్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏళ్ల పాటు కేసులను పెండింగ్ లోనే పెడుతూ పలు అనుమానాలకు తావిస్తున్నారు.
అరెస్టుల్లోను విఫలం:
2016లో పలు కేసుల్లో ఏసీబీ, విజిలెన్స్ 101 మందిని అరెస్ట్ చేసింది. అయితే వీరిపై చర్యలకు సంబంధిత శాఖలకు ఏసీబీ సిఫార్సు చేయాల్సి ఉన్నా అలాంటిదేమి జరగలేదు. 101మందిని అరెస్టు చేస్తే అందులో కేవలం 16మంది పైనే చర్యలు తీసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైంది.
తెలంగాణలో గతేడాది ఏసీబీ దర్యాప్తు చేసిన కేసుల్లో 125కేసులు మూతపడగా.. రాజస్తాన్ లో 89, ఆంధ్రప్రదేశ్ లో 80కేసులు మూతపడ్డాయి.
అందుకే క్లోజ్ చేస్తున్నారా?:
రాజకీయ ఒత్తిళ్లే ఏసీబీ కేసులు మూసివేయడానికి ప్రధాన కారణమన్న ఆరోపణ వినిపిస్తోంది. పలుకుబడిని ఉపయోగించి పైనుంచి పైరవీలు చేయడం వల్లే ఏసీబీ నిస్సహాయంగా ఉండిపోతున్నట్లు సమాచారం. సమయానికి చార్జీషీటు దాఖలు చేయకపోవడం, ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కావాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేటివ్, న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపకపోవడం వీటన్నంటి వెనుక రాజకీయ ఒత్తిళ్లే ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.