'ఆట మొదలైంద'నొద్దు, రాజకీయాలు సరే: రేవంత్కు హైకోర్టు, మావాళ్లూ లేస్తారు: కెసిఆర్
హైదరాబాద్: అక్రమంగా కేసులో ఇరికించారని, ఆట మొదలైంది.. ఆట కాదు వేట మొదలైంది.. వంటి వ్యాఖ్యలు చేయవద్దని ఓటుకు నోటు కేసులో నిందితుడైన టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బుధవారం సూచించింది. అయితే, రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చని సూచించింది.
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారని, బెయిల్ రద్దు చేయాలని ఎసిబి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. రేవంత్ ఈ నెల 9న ఎల్బీ నగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో హైకోర్టు షరతు ఉల్లంఘించారని ఎసిబి పేర్కొంది.
అయితే, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది మాట్లాడుతూ... కార్యకర్తల సమావేశంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ... రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చునని, కేసుల గురించి మాత్రం మాట్లాడవద్దన్నారు. మరోసారి కేసు గురించి మాట్లాడితే అఫిడవిడ్ దాఖలు చేయాలని జడ్జి సూచించారు.
హోదా తెలంగాణ ఎంపీ గుత్తా
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రత్యేక హోదాపై మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని గుత్తా కుండబద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తనకు స్పష్టంగా తెలిపిందన్నారు.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంపై తాను రాసిన లేఖకు కేంద్ర ప్రణాళిక, రక్షణ శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ సవివరంగా సమాధానమిచ్చారన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఉన్న అర్హతలు, ప్రాతిపదికను మార్చే ప్రతిపాదనేదీ లేదని చెప్పారన్నారు.దీంతో ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కేనన్నారు.
బీఏసీలో కేసీఆర్, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
తెలంగాణ శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్, టిడిపి శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ పార్టీ సభ్యులు లేచినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
దీనిపై స్పందించిన కేసీఆర్... మీ వాళ్లు చక్కగా ఉంటే మా వాళ్లు అడ్డుకోరని, మీ వాళ్లు లేస్తే, మా వాళ్లూ లేవాల్సి వస్తుందని చెప్పారు. దీంతో బీఏసీలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అంతేకాక ఎర్రబెల్లి చర్చించాలంటూ ప్రతిపాదించిన పలు అంశాలపై అధికార పక్షం అభ్యంతరం తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త అంశాలను ప్రస్తావిస్తే, చర్చకు అనుమతించేది లేదని మంత్రి హరీశ్ రావు ఘాటుగానే బదులిచ్చారట.