అమెరికా నుంచి వరంగల్ చేరుకున్న పావని మృతదేహం: మిన్నంటిన రోదనలు
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో జరిగి రోడ్డు ప్రమాదంలో మరణించిన గుళ్లపల్లి పావని మృతదేహం బుధవారం వరంగల్ జిల్లాలోని స్వగ్రామానికి చేరుకుంది. అక్టోబర్ 25న అమెరికాలోని కనెక్టికట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పావని మృతి చెందారు. మరణించిన 9 రోజుల తర్వాత వరంగల్లోని గిర్మాజీపేటకు పావని పార్థీవదేహం చేరుకుంది.
పావని మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కల్పన, రమేశ్, సోదరి వాసవి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కూతురు మరణించిన వార్త తెలిసినప్పటి నుంచీ తల్లి కల్పన రోదిస్తూనే ఉంది. కన్నతండ్రి తన దు:ఖాన్ని దిగమింగుకుంటూ ఆమెను ఓదార్చారు.

ఉన్నత చదువుల కోసం రెండు నెలల క్రితం ఇంటి నుంచి చిరునవ్వుతో అమెరికా బయల్దేరిన కూతరు అక్కడ్నుంచి.. విగతజీవిగా అట్టపెట్టెలో రావడంతో కుటుంబసభ్యుల రోదనకు అంతులేకేండా పోయింది. కూతురు మృతదేహం వద్ద లేవమ్మా అంటూ తల్లి చేసిన రోదనలు అందరినీ కలిచివేశాయి. కాగా, కుటుంబసభ్యులు, బంధువుల రోదనల మధ్యే పావని అంత్యక్రియలు ముగిశాయి.
అమెరికా రోడ్డు ప్రమాదంలో పావనతితోపాటు మరో ఇద్దరు మృతి
ఇటీవల అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పావనితోపాటు మరో ఇద్దరు తెలుగు యువకులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు పాటంశెట్టి సాయి నరసింహ(23) అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఎంఎస్ అభ్యసిస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఏడుగురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు.
అయితే, పొగమంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతోపాటు వరంగల్కు చెందిన పావని, హైదరాబాద్ కు చెందిన మరో యువకుడు ప్రేమ్ కుమార్ రెడ్డి మృతి చెందారు. కారులోని మిగిలిన ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సాయి నరసింహ కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం నెలకొంది.
నరసింహ చెన్నైలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ కంపెనీలో కొలువు సాధించాడు. ఆ తర్వాత ఎంఎస్ చేయాలని భావించి.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5న అమెరికాకు వెళ్లాడు. ఇటీవల అక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొని తల్లిదండ్రులకు వీడయో కాల్ కూడా చేశాడు.
అంతలోనే తమ కుమారుడు మరణించాడనే వార్త వినడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుశీల కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతుడి సోదరి పాటంశెట్టి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి ఐశ్వర్య కూడా సాయి ప్రయాణిస్తున్న కారులోనే ఉన్నప్పటికీ.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ఆస్పత్రితో చికిత్స తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications