కరోనాకు మరో అధికారి బలి: మహమ్మారి బారినపడి ఎస్ఐ చంద్రభాను మృతి
హైదరాబాద్/ఆదిలాబాద్: కరోనా మహమ్మారి బారినపడి సామాన్యులతోపాటు ప్రజాప్రతిధులు, అధికారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, కరోనాతో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ చంద్రభాను(56) మరణించారు. గత 10 రోజులుగా హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం కన్నుమూశారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ యంత్రాంగానికి సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్న చంద్రభాను.. గత 15 రోజుల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లును ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు.
ఈ క్రమంలోనే చంద్రభాన్ కు కరోనా సోకినట్లు వైద్య పరీక్షలు తేలింది. దీంతో ఆయన గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఎస్పీ విష్ణు ఎప్పటికప్పుడు వెంకటేశ్వర్లుతో మాట్లాడి చంద్రభాను ఆరోగ్య పరిస్థితులపై తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
కాగా, సోమవారం సాయంత్రం 7.50 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురై బీపీ పెరగడంతో చంద్రభాను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రభాన్ స్వస్థలం బజార్హత్పూర్ మండలం జాతర్ల గ్రామం. ఆయన 1985వ సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్ హోదాలో పోలీస్ శాఖలో చేరారు. 1987లో ఆలంపూర్.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పుల్లో తీవ్రగాయాలతో తృటిలో తప్పించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చంద్రభాను సేవలను గుర్తించి పదోన్నతి కల్పించి ముఖ్యమంత్రి శౌర్య పథకం అందించారు. 2018లో ఎస్ఐగా పదోన్నతి పొంది పోలీస్ స్పెషల్ బ్రాంచీలో విధులు నిర్వహిస్తున్నారు. చంద్రభానుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాగా, ఎస్ఐ మెస్రం చంద్రభాను మృతి పట్ల ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రభాను మృతి ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు తీరని లోటని ఆయన అన్నారు. చంద్రభాను కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 37,079 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1671కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 91 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినుంచి 181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,98,826కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2958కి చేరింది. వీరిలో 1226 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 96,50,662కి చేరింది.