చైనా పేరెత్తితేనే భయపడుతున్న జనం .. అదే చైనా వాళ్ళు కనిపిస్తే ఇక హడలే !!
కరోనా దెబ్బకు చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది .ఇక కరోనా ప్రభావంతో అగ్ర దేశాలు కూడా వణికిపోతున్న పరిస్థితి ఉంది. సంపన్న దేశాలను కూడా శోక సంద్రంలో ముంచుతుంది కరోనా . ఇక కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరి కంటే ఇతర దేశాల్లో ఉన్న చైనీయుల పరిస్థితి దారుణంగా ఉంది. వారిని సోషల్ గా బహిష్కరిస్తున్నారు ప్రజలు.

భారతదేశంలో ఉన్న చైనీయుల పరిస్థితి దారుణం
ఈ దేశం ఆదేశం అన్న తేడా లేకుండా చైనీయులను తిట్టి పోస్తున్నారు. వాళ్ళను చూస్తేనే కరోనా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే చాలా మంది చైనీయులు మన దేశంలో జీవనం సాగిస్తున్నారు. చదువుకోవటానికి ఇండియా వచ్చిన చైనీయులు ఉన్నారు. వివిధ వర్తక వాణిజ్యాలలో ఉన్న వారు లేకపోలేదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా చైనీయులు కరోనా ప్రభావంతో వివక్షకు గురవుతున్నారు. ఇక చైనా వాళ్లు కనిపిస్తే వణికిపోయే పరిస్థితి ఇటు ఇండియాలో కూడా కనిపిస్తుంది.

చైనీయులను చూస్తేనే కరోనా అన్నట్టు భయపడుతున్న జనం
కరోనా చైనా లో పుట్టినప్పటికీ అది అందరు చైనీయుల తప్పు కాదు . అయినప్పటికీ చైనా వాళ్ళు అంటేనే హడలిపోతున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఎవరైనా చైనీయులు కనిపిస్తే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలో జరిగిన ఘటన చైనీయుల విషయంలో ఉన్న భయాన్ని తేటతెల్లం చేస్తుంది. హైదరాబాద్ లో నిన్న రాత్రి వాహన తనిఖీలు జరిపారు పోలీసులు . నగరమంతా లాక్ డౌన్ లో ప్రశాంతంగా ఉన్నవేళ ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒక కారులో చైనీయులను చూసి షాక్ తిన్నారు.

ఎర్రగడ్డ వద్ద వాహన తనిఖీల్లో చైనా మహిళలు .. క్వారంటైన్ తరలింపు
మూసాపేట వైపు వెళుతున్న ఒక కారును ఆపిన పోలీసులకు అందులో ముగ్గురు యువతులు ప్రయాణిస్తున్నట్టు కనిపించింది . వారిలో ఇద్దరు చైనా వారు కాగా మరొక యువతి నాగాలాండ్ కు చెందిన మహిళగా గుర్తించారు. దీంతో చైనా వాళ్ళు కనిపించారు అని , వారు అక్కడ నుండే వచ్చారు అన్న భావనలో స్ధానికంగా ఈ వార్త కలకలం రేపింది. అయితే వీరికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. చైనా యువతులు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఏపని మీద వచ్చారు మొదలైన విషయాలు పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు వారిని వైద్య పరీక్షలనిమిత్తం క్వారంటైన్ కు తరలించారు.

మన దేశంలోని చైనీయుల పట్ల మానవత్వం ఉండాలన్న హ్యుమనిస్టులు
ఇక ఇలాంటి ఘటనల నేపధ్యంలో చైనీయుల పరిస్థితి దారుణంగా మారింది. బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. వారి పట్ల సానుభూతి ఉన్న వారు సహకారంతో జీవనం సాగించే పరిస్థితికి వచ్చారు చాలా మంది చైనీయులు . ఇక కరోనా అంటేనే చైనా, చైనా అంటేనే కరోనా అన్న వ్యాఖ్యలు కూడా రాజకీయ నాయకుల నుండి ప్రముఖుల నుండి వినిపిస్తున్న నేపధ్యంలో చైనా వారి మీద మరింత వివక్ష పెరుగుతుంది. ఏ దేశం వారైనా వారు కూడా మనుషులే అని గుర్తిస్తే మానవత్వంతో ప్రవర్తిస్తే బాగుంటుంది అన్న భావన ఈ పరిస్థితుల నేపధ్యంలో మానవతావాదుల నుండి వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications