PM Modi: తెలంగాణ పై ప్రధాని మోదీ నజర్ : రూట్ మ్యాప్ ఫిక్స్ - స్వయంగా..!!
PM Modi to visit Telangana: గుజరాత్ - హిమాచల్ ఎన్నికలు ముగిశాయి. ఇక, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీకి కీలకం. అందులో కర్ణాటక- తెలంగాణ ఉన్నాయి. షెడ్యూల్ కంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ అంచనా. దీంతో, ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..సీఎం కేసీఆర్ రాజకీయాలకు కౌంటర్ గా బీజేపీ కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. గత నెలలో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మరోసారి రాష్ట్రంలో పర్యటనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ప్రధాని - షా తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ మరోసారి ప్రధాని పర్యటన..
గత నెలలో ఏపీలో విశాఖతో పాటుగా తెలంగాణ రామగుండంలో ప్రధాని పర్యటించారు. ఇప్పుడు తెలంగాణలో ఈ నెలాఖరులో ప్రధాని మరోసారి పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల పైన సమయం కేటాయిస్తామని గతంలోనే ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలే లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తున్న వేల..బీజేపీ కౌంటర్ పొలిటికట్ స్ట్రాటజీకి సిద్దమైంది. ఇప్పటికే రాష్ట్రంలో సీబీఐ - ఈడీ- ఐటీ సోదాలతో రాజకీయం హీటెక్కుతోంది. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కేంద్ర విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావటానికి ప్రధాని మోదీ స్వయంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీకి రూట్ మ్యాప్ ఖరారు పైన బీజేపీ ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ప్రధాని ప్రారంభోత్సవాలు - శంకుస్థాపనలు
రైల్వే బోర్డు తాజాగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య వందేభారత్ రైలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ రైలును సికింద్రబాద్ లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో ఈ రైళ్ల పట్ల ఆదరణ కనిపిస్తున్న సమయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైలు కావటంతో, దీనిని ప్రధానితో ప్రారంభించాలని కిషన్ రెడ్డి ఆలోచన. దీని పైన ఇప్పటికే రైల్వే మంత్రితోనూ కిషన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అదే సమయంలో బీబీనగర్ ఏయిమ్స్ కొత్త భవనాలకు ప్రధాని తో శంకుస్థాపన చేయించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. వీటితో పాటుగా కేంద్ర పరిధిలోని మరిన్ని కార్యక్రమాలు ప్రధాని పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి పర్యటనకు సంబంధించి అధికారికంగా ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ కు కేంద్రం ఏమీ చేయటం లేదనే టీఆర్ఎస్ విమర్శలకు సమాధానంగా ప్రధాని - షా పర్యటనల ద్వారా సమాధానం చెబుతూ.. ప్రజలకు దగ్గరవ్వాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

ముందస్తు ఎన్నికల అంచనాలతో.. రూట్ మ్యాప్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ప్రతీ మూలకు వెళ్లే విధంగా యాత్రలకు సిద్దం అవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రతీ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ ఖరారయ్యేలా యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రులు ప్రతీ నెలా తెలంగాణలోని జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు.. కేంద్రం రాష్ట్రానికి చేసిన నిర్ణయాలను ప్రజలకు వివరించే బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక, బీజేపీ అనుబంధ సంఘాలు క్షేత్ర స్థాయిలో పార్టీకి పట్టు పెంచే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇటు సీఎం కేసీఆర్ బీజేపీ లక్ష్యంగా తన జోరు కొనసాగిస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ రాజకీయం తెలంగాణలో మరింత రంజుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications