ఎన్నారై జయరాం హత్య కేసు: ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి.. ఇలా ఎందుకు చేశారు?
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరి గురువారం నాడు ఏసీపీ కార్యాలయానికి వచ్చింది. గత నెల హత్యకు గురైన జయరాం కేసులో ఆయన కుటుంబం.. శిఖా వైపు వేళ్లు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్య కేసులో తమ ఎదుట హాజరు కావాలన్నారు.
ఇలా ఎందుకు చేశారు?
ఈ నేపథ్యంలో శిఖా చౌదరి ఈ రోజు (ఫిబ్రవరి 14) పోలీసుల ఎదుట హాజరయ్యారు. జయరాం హత్య కేసులో ఆమెను ప్రశ్నిస్తున్నారు. మామయ్య హత్య తెలిసి కూడా ఆమె తొలుత ఆయన ఇంటికి ఎందుకు వెళ్లింది? కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడికే ముందు వెళ్తారు? కాని శిఖా అలా ఎందుకు చేయలేదు? రాకేష్ రెడ్డితో పరిచయం, జయరాం తీసుకున్న అప్పు.. తదితర అంశాల గురించి ఆమెను ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
26 గంటలు ఆ ఇంట్లోనే జయరాం
ఇదిలా ఉండగా, జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు రోడ్డు నెంబర్ 10లోని రాకేషక్ రెడ్డి నివాసాన్ని గురువారం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు పరిశీలించారు. జయరాంను రాకేష్ రెడ్డి ఇంట్లోనే హత్య చేసినట్లు తేలిన నేపథ్యంలో హత్య జరిగిన ఒకరోజు నాటి సీన్ను రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 30వ తేదీ రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చిన జయరాం దాదాపు 26 గంటల పాటు అదే ఇంట్లో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు రాకేష్ రెడ్డి ఇంటిని పరిశీలించారు.
ఏడుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో
జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే నిందితుడు రాకేష్ అతనిని ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు. జయరాంను చంపేసిన అనంతరం హైదరాబాదులోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించి అప్పు ఇచ్చినట్లుగా దొంగ పత్రాలు సృష్టించాడని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.