కేసీఆర్ను చూసి నేర్చుకోండి: ముఖ్యమంత్రులకు మోడీ, టి తర్వాత బీహార్
కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు వస్తున్నాయి. జీఎస్టీ బిల్లును తొలుత ఆమోదించిన తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు వస్తున్నాయి. జీఎస్టీ బిల్లును తొలుత ఆమోదించిన తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
రుణమాఫీతో పోలిస్తే మంచి నిర్ణయం
జీఎస్టీ బిల్లు తొలి దశలోనూ తెలంగాణ ఇదే చొరవను ప్రదర్శించిందని మోడీ అన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల ధోరణిని కనబరిచారు. తెలంగాణ ఉచిత ఎరువుల పథకాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు సభ్యుడు రమేశ్ చంద్ ప్రశంసించారు. రుణమాఫీతో పోలిస్తే ఇది మంచి నిర్ణయమన్నారు.
రుణమాఫీ ఇవ్వాలనుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ తరహాలో ఎరువులు ఇవ్వడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం బాగుందన్నారు. 2022కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమం సహా పలు అంశాలపై నీతిఆయోగ్ మంగళవారం మూడేళ్ల కార్యాచరణను ప్రకటించింది.
రద్దు వారిదే...
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, సభ్యుడు రమేశ్ చంద్ విలేకరులతో మాట్లాడారు. సాగు రుణాల మాఫీ రాష్ట్రాల పరిధిలోని అంశమని పనగాడియా అన్నారు. రద్దు చేయాలనుకుంటే రాష్ట్ర రాజకీయ నాయకత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానాన్ని రూపొందించటం, దాన్ని అమలు చేయటం, అవసరమైన సాంకేతికతను అందించటమే తమ బాధ్యతన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును తెలంగాణ తర్వాత బీహార్ రాష్ట్రం కూడా ఆమోదించింది. బీహార్ రెండో రాష్ట్రం.