ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా..
నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా..
మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె.. కిడ్నీలు కోల్పోయిన వారికి నా మూత్రపిండాలు.. ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి నా ఊపిరితిత్తులు.. కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం.. ఇలా నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి.. ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి.. ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను..
ఓ యువ వైద్యుడు చనిపోకముందు రాసిన కవిత ఇది. దురదృష్టవశాత్తు అతను చనిపోవడంతో అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన చిన్ని నిఖిల్.. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. అతను ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

అతనన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. మే 1న నిఖిల్ బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. నిఖిల్ కోరిక మేరకు అతని అమ్మనాన్న రమేష్, భారతి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.ప్రత్యేక ఆంబులెన్స్లో నిఖిల్ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. ఆరుగురికి అవయవదానం చేశారు. కాలేజీలో ఉన్న సమయంలో అవయవదానం చేస్తానని నిఖిలి ప్రతిజ్ఞ చేసి సమ్మతి పత్రంపై సంతకం కూడా చేశాడు.
అయితే నిఖిల్ కవిత ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. చిన్న వయస్సులో పెద్ద మనస్సుతో ఆలోచించిన అతను నిజంగానే గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవును అతను మరణించినా.. ఆరుగురిలో జీవించి ఉంటాడు.












Click it and Unblock the Notifications