తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..?
తెలంగాణ బీజేపీ నాయకత్వం తమను పెద్దగా పట్టించుకోవట్లేదని ఇటీవల బాహాటంగానే విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పార్టీకి మరో షాకిచ్చేందుకు సిద్దమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తున్న వేళ... జనసేన కూడా అక్కడ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన కమిటీని ఆ పార్టీ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది.
దాడులు చేస్తే కేసులు పెట్టరా?: అధికార పార్టీ గూండాలంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
ఇరువురిలో తీవ్రమైన అసంతృప్తి...
ప్రతీసారి బీజేపీ తమను వాడుకుని వదిలేస్తోందని... తమను సరైన గౌరవం ఇవ్వట్లేదని ఇటీవల పార్టీ ఆవిర్భావ వేడుకలో జనసేనాని వాపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు,ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి మద్దతునిచ్చి బీజేపీకి షాకిచ్చారు. దీంతో పవన్ తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వడమేంటని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే.. తమ దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు.
జనసేన-బీజేపీ మధ్య పెరిగిన గ్యాప్...
తెలంగాణ బీజేపీ-జనసేన మధ్య చాలా గ్యాప్ ఉందని బండి సంజయ్,పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్,డీకే అరుణ లాంటి నేతలు జనసేనతో పొత్తు విషయంలో గతంలో చేసిన చులకన వ్యాఖ్యలు ఆయన్ను నొచ్చుకునేలా చేశాయని తెలుస్తోంది. జనసేనతో అసలు తమకు పొత్తే లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ధర్మపురి అరవింద్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. డీకె అరుణ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ... ఓట్లు చీల్చవద్దన్న ఉద్దేశంతో పవన్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం తాము పోటీ నుంచి తప్పుకుని త్యాగం చేసినప్పటికీ... ఆ పార్టీ నేతలు జనసేన పట్లు చులకన వ్యాఖ్యలు చేయడం,గెలిచాక తమను పెద్దగా పట్టించుకోకపోవడం పవన్ను బాధించినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ పాదయాత్రకు సిద్దమవుతున్న వేళ...
దుబ్బాక,జీహఎచ్ఎంసీ ఎన్నికల విజయాలతో ఊపు మీదున్న బీజేపీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతోంది. నివేదితా రెడ్డి,అంజయ్య యాదవ్ లాంటి ఆశావహులు టికెట్లు ఆశిస్తుండగా... ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తామూ అభ్యర్థిని ప్రకటించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థి ప్రకటన కన్నా ముందే.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పాదయాత్ర కూడా ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి తరుణంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు పార్టీ కమిటీని జనసేన ప్రకటించడం గమనార్హం. ఇందులో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా కమిటీ సభ్యులను పార్టీ నియమించింది.
జనసేన పోటీ చేస్తే బీజేపీకి నష్టమే...?
బీజేపీ కోసం పోటీ నుంచి తప్పుకుని త్యాగాలు చేయడం ఇక చాలు అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆంధ్రాలోనూ బీజేపీతో పొత్తు తమ కొంపు ముంచిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులే కరెక్ట్ అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలో జనసేన అభ్యర్థిని నిలిపే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే సాగర్లో ఓట్లు చీలి బీజేపీకి నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు.
ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీ నియామకం pic.twitter.com/PxjplxXCn3
— JanaSena Party (@JanaSenaParty) March 18, 2021