ప్రధాని మోడీ, ఇవాంకా కోసం హైదరాబాద్ ఎలా తయారయిందంటే (ఫోటోలు)
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు కూతురు ఇవాంకా ట్రంప్ తదితర ప్రముఖులు వస్తున్నారు. అతిథుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు కూతురు ఇవాంకా ట్రంప్ తదితర ప్రముఖులు వస్తున్నారు. అతిథుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని, ఇవాంక పాల్గొనే ప్రాంతాల బాధ్యతలకు అధికారులు
ప్రధాని మోడీ, ఇవాంకలు పాల్గొనే వివిధ ప్రాంతాలను ఒక్కో అధికారికి అప్పగించారు. ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతలు చేపడతారు. గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్ల వద్ద హైదరాబాద్ అదనపు సీసీ(నేరాలు) స్వాతిలక్రా, అదనపు సీపీ(సమన్వయం) మురళీకృష్ణలు బాధ్యతలు నిర్వహిస్తారు.
ప్రధాని మోడీ రైలు మెట్రో ప్రారంభించే ప్రాంతంలో
ఫలక్నుమా భద్రతా ఏర్పాట్లు మహబూబాద్ ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షిస్తారు. ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభించే మియాపూర్ ప్రాంతంలో భద్రతా ఏర్పాటు సైబరాబాద్ డీసీపీ(పరిపాలన) ప్రకాశ్ రెడ్డి చూస్తారు. మెట్రో స్టేషన్ వద్ద ఐజీ అనిల్ కుమార్ పర్యవేక్షిస్తారు. ఇవాంక వాహనాల శ్రేణి బాధ్యతలు ఐజీ(ఆపరేషన్స్) శ్రీనివాసరెడ్డికి అప్పగించారు.
ప్రముఖులు ప్రయాణించే రహదారిపై
ఇవాంకా వచ్చే శంషాబాద్ విమానాశ్రయం వద్ద సీఐడీ ఐజీ షీకాగోయల్ను నియమించారు. ప్రముఖులు ప్రయాణించే రహదారులపై ట్రాఫిక్ బాధ్యతలు హైదరాబాద్ డీసీపీ(ట్రాఫిక్) అవినాష్ మహంతి చూస్తారు.
అంతర్జాతీయంగా తెలంగాణను పరిచయం చేసేందుకు
కాగా, గ్లోబల్ సదస్సుపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను మరింత పరిచయం చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
రూ.45 కోట్లతో ఎన్నో అభివృద్ధి, సుందరీకరణ పనులు
దాదాపు రూ.45 కోట్లతో 101 రకాల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టి ఇప్పటికే దాదాపు పూర్తి చేసింది. రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, హెచ్ఐసీసీ ప్రాంగణం, సైబర్ టవర్, హైటెక్స్ రహదారి, రహేజ ఐటీపార్కు, మైండ్స్పేస్, కొత్తగూడ ప్రాంతాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతోంది.
పుష్పాలతో అలంకరణ
ఈ రోడ్ల పరిధిలో దాదాపు 20 కిలో మీటర్ల విస్తీర్ణంలో 71 వేల పూల మొక్కలను నాటారు. చామంతులు, బంతిపూలు, సీజనల్ ప్లవర్స్ లాంటి అరుదైన పుష్పాల అందాలతో హెచ్ఐసీసీ ప్రాంగణానికి వెళ్లే రహదారులను తీర్చిదిద్దారు. ఫుట్పాత్లు, డివైడర్ల మధ్యలో ఆకుపచ్చ తివాచీలు పరిచారు.
పూలకుండీలు, బెంచీలు, చెట్లకు జీవకళ తెస్తున్న విద్యార్థులు
యాభై మంంది కళాకారులతో పాటు వైష్ణవి ఆర్ట్స్ కళాశాలకు విద్యార్థులు పూలకుండీలు, బెంచీలు, చెట్లపై విరామం లేకుండా తమ కుంచెలతో జీవకళను సృష్టిస్తున్నారు.
ఫ్లై ఓవర్ పైన పల్లెసీమల చిత్రాలు
గచ్చిబౌలి ప్లైఓవర్పై పల్లెసీమల్లో కులవృత్తులకు ఉన్న ప్రాధాన్యత, నాటి సంస్కృతిలో మమేకమైన కుమ్మరి, వడ్రంగి, మత్స్యకార, వ్యవసాయ కూలీలు తదితర బొమ్మలతో తీర్చిదిద్దారు.
తెలంగాణ సంస్కృతి, భారత చరిత్ర
తెలంగాణ సంస్కృతిని చాటేలా బతుకమ్మ ఆటలు, కోలాటాలు, బొమ్మల కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్లాంటి నాట్య భంగిమల్లో ఉన్న మహిళల చిత్రాలు భారత సంస్కృతిని చాటి చెప్పేలా ఉన్నాయి.