ఆక్సిజన్ బ్యాంక్..మెడిసిన్ కిట్స్.. హెల్ప్లైన్: ఒవైసీ..రూ.1.40 కోట్ల కోవిడ్ ప్యాకేజీ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చుతోంది. రోజురోజుకూ విజృంభిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో పోల్చుకుంటే.. తెలంగాణలో నమోదవుతోన్న రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. దాని తీవ్రత అధికంగా ఉంటోంది. మరణాలు రెండువేలను దాటేశాయి. వేల సంఖ్యలో యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. వైద్యశాఖాధికారులు ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఇప్పటిదాకా తెలంగాణలో 2,042 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.
యాక్టివ్ కేసులు 65,597గా నమోదయ్యాయి. మొత్తం కేసులు నాలుగు లక్షలను దాటాయి. ఒక్కటని కాకుండా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డుల్లోకెక్కుతున్నాయి. అన్నింటికీ మించి- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 1,418 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలను తీసుకుంది. రాత్రివేళ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది.
అయినప్పటికీ.. తీవ్రతలో పెద్దగా ఆశించిన మార్పు కనిపించట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు, అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తక్షణ సహాయక చర్యలకు దిగారు. మజ్లిస్ ఛారిటీ ట్రస్ట్ కింద 1.40 కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద ఆక్సిజన్ బ్యాంక్ను నెలకొల్పారాయ. కరోనా బారిన పడిన వారికి అందజేసే మందులు, ట్యాబ్లెట్లతో కూడిన మెడిసిన్ కిట్స్ను అందుబాటులోకి ఉంచారు.
అలాగే- ఓ హెల్ప్లైన్ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ హెల్ప్లైన్ కేంద్రం నంబర్ 7306600600. తెల్లవారు జామున 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎవ్వరైనా సరే.. ఈ నంబర్కు ఫోన్ చేసి, తమకు కావాల్సిన సహాయాన్ని పొందవచ్చని ఏఐఎంఐఎం తెలిపింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మజ్లిస్ ఛారిటీ ట్రస్ట్ కింద ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఒవైసీ పేర్కొన్నారు.