రీతుకు మళ్లీ పోస్టుమార్టం: భర్త సచిన్ ఏం చెప్పాడు?
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూ (28) మృతదేహానికి గాంధీ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం నాడు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. మార్చురీ ఇంఛార్జ్ డాక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు.
తలలో అంతర్గతంగా బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు చెప్పారు. సోమవారం నిర్వహించిన పోస్టుమార్టం విషయంలో తమకు అనుమానాలున్నట్లు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఏసీపీ ఆదేశాల మేరకు మంగళవారం మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు.
తలలోని గాయాలు ఎవరైనా దాడి చేయడం వల్ల ఏర్పడ్డాయా లేక తనకు తానుగా పడటం వల్ల ఏర్పడ్డాయా అనేది తేలాల్సి ఉందని సమాచారం. విస్రాలను పరీక్షించాక అది తెలియనుంది. పోస్టుమార్టం అనంతరం రీతు సోదరి తుళిక కొంతసేపు డాక్టర్తో మాట్లాడారు. ఎలా చనిపోయిందన్న విషయమై ఆరా తీశారు. విష ప్రయోగంపై ప్రశ్నించింది.
పోస్టుమార్టం నివేదిక అనంతరం....
రీతూ మృతిపై మల్కాజిగిరి ఏసీపీ మాట్లాడుతూ.. పోస్టుమార్టం పూర్తయిందని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక విషయం ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు.
మరోవైపు, రీతు భర్త సచిన్ పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను తన భార్యపై ఓ దెబ్బ వేశానని చెప్పాడని తెలుస్తోంది. ఆ తర్వాత బయటకు వెళ్లి సిగరేట్ తాగి ఇంట్లోకి వచ్చాక ఆమె అన్కాన్సియస్లో ఉన్నట్లుగా గుర్తించానని చెప్పాడని తెలుస్తోంది.