కొత్త టెన్షన్.. 'పారాసిటమాల్'తో తప్పించుకుంటున్న విదేశీ ప్రయాణికులు..
తెలుగు రాష్ట్రాల్లో 'పారాసిటమాల్' మీద ఇప్పుడు ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్తో కరోనాకు చెక్ పెట్టవచ్చునని చెప్పడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రజల్లో భయాందోళన కలగకుండా వారికి ధైర్యం చెప్పేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా కామెంట్స్ చేశారని చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక అసలు విషయానికొస్తే.. విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటున్న ప్రయాణికులు స్క్రీనింగ్ టెస్టులకు దొరక్కుండా 'పారాసిటమాల్' ఎత్తుగడ వేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే.. థర్మల్ స్క్రీనింగ్లో దొరికే అవకాశం ఉండటంతో.. విమానం ఎక్కిన తర్వాత పారాసిటమాల్,ఐబ్రూఫిన్, ఆస్పిరిన్ వంటి మాత్రలను వేసుకుంటున్నారు. ఒకవేళ టెస్టుల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్టు తేలితే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించే అవకాశం ఉండటంతో.. దాని నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లేందుకు ఇలాంటి మాత్రలను వేసుకుంటున్నారు.
స్క్రీనింగ్ టెస్టుల్లో సాధారణ శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్టు తేలితే.. వారిని ఇంటిలోనే ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. దీంతో పారాసిటమాల్ వేసుకుని థర్మల్ స్క్రీనింగ్కి దొరక్కుండా చాలామంది విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలాంటివాళ్లతో సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. విదేశాల నుంచి వస్తున్న వీరికి కరోనా లక్షణాలు ఉంటే ఇతరులకు కూడా అది సులువుగా వ్యాప్తి చెందుతుంది. దీనిపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదు వెళ్లడంతో దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. అయితే వీళ్లంతా విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. తెలంగాణలో ఇంతవరకూ ఏ వ్యక్తికీ కరోనా సోకలేదన్నారు. ప్రభుత్వ సలహాలు,సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. అనవసర ప్రయాణాలు,ఫంక్షన్లు వద్దని సూచించారు.