ఎత్తు తగ్గింది: ట్విన్ టవర్స్కు ఓకే, 89 మీటర్ల ఎత్తులో 20 అంతస్తులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అతి పెద్ద 'కమాండ్ కంట్రోల్' కేంద్రంతో పాటు నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం ట్విన్ టవర్స్ రూపుదిద్దుకోబోతున్నాయి. స్ధలం, భవనం ఎత్తు విషయంలో ఎదురైన అవరోధాలను పోలీసు శాఖ అధిగమించింది.
దీంతో నగరంలో 20 అంతస్తుల ఎత్తులో ఈ భవనాలను నిర్మించడానికి అధికారులు ప్రణాళికలను రూపొందించారు. న్యూయార్క్, లండన్ తరహాలో ఇక్కడ అతి పెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక వ్యవస్థలతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ దీనికి శ్రీకారం చుట్టారు.
దీని కోసం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో పోలీసు శాఖ 'ట్విన్ టవర్స్'కు శంకుస్థాపన కూడా చేశారు. తెలంగాణలో పరిధిలో ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లపై ఆయన దృష్టిసారించారు. అత్యంత శక్తివంతమైన సీసీ కెమేరాలను అన్ని కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పోలీసులు అత్యాధునికి టెక్నాలజీని వినియోగించుకోవడం వల్ల నగరంలో క్రైమ్ శాతం చాలా వరకు తగ్గింది. కాగా ట్విన్ టవర్స్ భవనాల నిర్మాణం కోసం రూ.303 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. సాంకేతిక పరికరాల ఏర్పాటుకు మరో రూ.400 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
అయితే ట్విన్ టవర్స్ నిర్మించే స్థలం విషయంలో మొదట్లో కాస్తంత ఇబ్బంది వచ్చింది. ఈ స్థలం తనదంటూ ఓవ్యక్తి హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా.. తనకు సరైన జవాబు కూడా ఇవ్వలేదని సంబంధిత వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
ఈ దరఖాస్తును ఎందుకు తిరస్కరించామన్న దానిపై మాత్రం పూర్తి వివరాలతో సంబంధిత ఫిర్యాదుదారుకు తెలియజేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో స్థల వివాదం ముగిసిపోయిందని అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తికి సమాధానం ఇచ్చిన తర్వాత నిర్మాణాలను మొదలు పెట్టాలని పోలీసులు నిర్ణయించారు.
తొలుత ట్విన్ టవర్స్ను 40 అంతస్తులుగా నిర్మించాలని మొదట అనుకున్నారు. అయితే ఎయిర్పోర్టు అథారిటీ ఇందుకు అంగీకరించలేదు, ఆ తర్వాత ప్రభుత్వం ఎయిర్పోర్టు అథారిటీని వివరణ కోరడంతో 89 మీటర్ల ఎత్తులో భవనాలను నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో 20 అంతస్తుల ఎత్తులో రెండు భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే ట్విన్ టవర్స్కు సంబంధించి టెండర్లను పిలవడం జరిగింది. ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థ టెండర్లను దాఖలు చేశాయి. ఏడాదిన్నరలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించారు.