నేడే కేసీఆర్-అఖిలేశ్ భేటీ: 'ఫెడరల్ ఫ్రంట్'పై చర్చ, కేటీఆర్ తోనూ భేటీకి ఛాన్స్!
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసినవేళ.. అఖిలేశ్ ఆయనతో భేటీ అయి చర్చించనున్నారు.
ఫ్రంట్ లక్ష్యాలు, ప్రణాళిక, కార్యాచరణపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్-కేసీఆర్ మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదిలా ఉంటే, నిజానికి తానే స్వయంగా లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్, ములాయం యాదవ్ లతో భేటీ అవాలని కేసీఆర్ భావించారు. కానీ ములాయం సూచన మేరకు అఖిలేశ్ హైదరాబాద్ వస్తానని కేసీఆర్ తో చెప్పారు. చెప్పినట్టుగానే నేడు ఆయన హైదరాబాద్ రానున్నారు.
బుధవారం మధ్యాహ్నాం 12.30గం.కు అఖిలేశ్ హైదరాబాద్ బేగంపేట విమానశ్రయానికి చేరుకుంటారు. అఖిలేశ్ రాకవేళ అన్ని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా కొంతమంది మంత్రులను పురమాయించారు కేసీఆర్. విమానశ్రయం నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లనున్న అఖిలేశ్.. అక్కడ కేసీఆర్ తో భేటీ అవనున్నారు. మధ్యాహ్నా భోజనం తర్వాత కేటీఆర్ సహా మరికొంతమంది నేతలతోనూ అఖిలేశ్ భేటీ అవుతారని తెలుస్తోంది.
కాగా, అఖిలేశ్ యాదవ్ కు మంచి విందు ఇచ్చేందుకు ఉత్తరాది, దక్షిణాది వంటకాల కాంబినేషన్ తో మెనూ తయారుచేయించినట్టు సమాచారం. కేసీఆర్ తో భేటీ అనంతరం సాయంత్రం 4.30గం.కు అఖిలేశ్ తిరిగి లక్నో బయలుదేరనున్నారు.












Click it and Unblock the Notifications