కెసిఆర్ కోసం విపక్ష నేతల నిరీక్షణ, అరెస్ట్, ఉద్యోగాలపై కడియం మెలిక
హైదరాబాద్: మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసేందుకు వచ్చిన అఖిల పక్ష నేతలకు చుక్కెదురయింది. కార్మికుల జీతాల విషయమై కెసిఆర్ను కలిసేందుకు టిడిపి, వైసిపి, వామపక్ష నేతలు వచ్చారు.
సచివాలయంలోని సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాకు ముందు వారంతా కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూశారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తదితరాలపై సీఎంతో చర్చించేందుకు తమను అనుమతించాలని కోరారు.
అయితే కేసీఆర్ నుంచి వారికి పిలుపు రాలేదు. అపాయింటుమెంట్ దొరకక పోవడంతో సమతా బ్లాకు ముందే చాలాసేపు వేచి చూసిన వారు.. సి బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కళాశాలల్లో ఉన్న ఖాళీలు తర్వలో భర్తీ చేస్తాం: కడియం
గురుకుల పాఠశాలల ఏకీకరణపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. గురుకుల పాఠశాలల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏడాది 1190 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు నెలల్లో విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు, వీసీల నియామకం చేపడతామని, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు.
కళాశాలల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి మెరుగైన విద్య అందిస్తామన్నారు. విద్యాశాఖలో అవినీతి, అక్రమాల నివారణకు ఆన్లైన్లో సేవలు ప్రారంభిస్తామన్నారు.
ఇప్పటికే ఇంటర్ బోర్డు ద్వారా అందించే సేవలను ఆన్లైన్లో ఉంచామని, ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలపై విచారణ జరుగుతోందన్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేశాకనే కొత్త ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారు. దీంతో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ పైన అయోమయం నెలకొంది.