అల్లు అర్జున్, ర్యాపిడో క్షమాపణ చెప్పాలి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్, సెలబ్రిటీలకు చురకలు
హైదరాబాద్: ర్యాపిడో యాడ్ వివాదంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామఅన్నారు. యాడ్లో నటించిన అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్నారు.
అల్లు అర్జున్, ర్యాపిడీ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే..: సజ్జనార్
ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తమ నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామన్నారు. తక్షణమే అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని వెల్లడించారు. వెంటనే ఆ యాడ్ నిలిపివేయాలన్నారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని చురకులు అంటించారు సజ్జనార్. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని హితవు పలికారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని, తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని వెల్లడించారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందని సజ్జనార్ తెలిపారు.
అల్లు అర్జున్ సహా సెలబ్రిటీలకు సజ్జనార్ చురకలు, వార్నింగ్
'రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుని లగ్జరీ కార్లలో తిరుగుతారు.. ఆర్టీసీ బస్సుల్లో తిరిగే సామాన్యులంటే చిన్నచూపా' అంటూ సెలబ్రిటీలపై సీరియస్ అయ్యారు సజ్జనార్. ఆర్టీసీ ప్రయాణాన్ని కించపరుస్తూ తీసిన యాడ్పై అల్లు అర్జున్, ర్యాపిడో ఏజెన్సీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాపిడో యాడ్లో చూపిన బస్సు తెలంగాణ బస్సేనని అన్నారు. హెచ్సీయూ బస్ డిపో నుంచి ఒక రోజు కోసం రెంట్ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేశారని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఎక్కితే దోశలా అవుతారంటూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామంటూ సజ్జనార్ హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
అల్లు అర్జున్, ర్యాపిడోకు ఇప్పటికే ఆర్టీసీ లీగల్ నోటీసులు
మంగళవారమే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే. టీవీ ఛానల్ ప్రకటనల్లో, యూట్యూబ్లో ప్రసారం అవుతున్న ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ఆ ప్రకటనలో చెప్పడం కనిపిస్తుంది.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారంతా ఖండిస్తున్నారు.
అల్లు అర్జున్, ర్యాపిడో ప్రకటనపై విమర్శలు
టీఎస్ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. కాగా, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను లాభాల్లో నడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు సజ్జనార్. పలుమార్లు ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించారు. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతేగాక, ఆర్టీసీ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు. కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికులను తక్కువ ఖర్చుతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.