వాటిని పట్టించుకోం, మాకేం పని: ప్రపంచ బ్యాంక్ ర్యాంకులపై కెటిఆర్
హైదరాబాద్: పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలలో.. తెలంగాణ 13వ స్థానంలో ఉండటంపై తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు తనదైన శైలిలో స్పందించారు.
ఈ రాష్ట్రాల జాబితాను ఏ ప్రాతిపదికన రూపొందించారన్న విషయం తనకు తెలియదన్నారు. వీటిని తాము పట్టించుకోమని చెప్పారు. అసలీ ర్యాంకులతో తమకు పని లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, సోమవారం ప్రపంచ బ్యాంకు వెల్లడించిన ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో నిలువగా, ఏపీ రెండో స్థానంలో ఉంది.

నాగంపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం
రైతు ఆత్మహత్యల పైన విపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని టిఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతు కేంద్రం ఆదీనంలో ఉంటుందని చెప్పారు.
బిజెపి నేత, తెలంగాణ బచావో చీఫ్ నాగం జనార్ధన్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లారని, అప్పుడు కూడా అది విహారమే అవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిల వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. పసుపు రైతులను నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఏనాడైనా పట్టించుకున్నారా అని నిలదీశారు.
చెట్లు నరికిన వారిపై పీడీ యాక్టు నమోదు: జోగు
చెట్లు నరికిన వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం ఎలికట్ట మొగిలిగిద్దలో నేడు హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో మంత్రులు జోగురామన్న, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్నారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున రెండో విడత హరితహారం ప్రారంభించామని చెప్పారు. చెట్లు నరికిన వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. జడ్చర్చలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో మంత్రులు మొక్కలు నాటారు.












Click it and Unblock the Notifications