ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నాదా బాద్యత?బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.!
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు మంత్రి కేటీఆర్ బాద్యుడని ఈనెల 11న సోషల్ మీడియా వేదికగా బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ చేసిన పోస్టును పురపాలక, ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తప్పుబట్టారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు జారీచేయించారు మంత్రి కేటీఆర్. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేసారు బండి సంజయ్. బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేసారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని బండి సంజయ్ ని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేసారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా, కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు కేటీఆర్ న్యాయవాది. మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న న్యాయవాది డిమాండ్ చేసారు.