కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు: అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం, ముట్టడితో ఉద్రిక్తత
హైదరాబాద్: నేటితో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6న ప్రారంభం కాగా, మొదటి రోజు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్రెడ్డిలకు సంతాపం తెలిపారు. సెప్టెంబర్ 12, 13వ తేదీలకు సభలను వాయిదా వేశారు.
పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పెట్టాలంటూ తీర్మానం
ఆ తర్వాత తిరిగి సోమవారం ప్రారంభమైన ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి.. వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మూడో రోజైన నేడూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అనంతరం శాసనసభలో 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 8 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందన్న మంత్రి కేటీఆర్... రాష్ట్రం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో పలు కీలక బిల్లులకు ఆమోదం
జీఎస్టీ చట్ట సవరణ బిల్లును తలసాని ప్రవేశపెట్టగా... జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లును శాసనసభ ఆమోదించింది.
అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. 25 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేలా ప్రత్యేక నిబంధన పెట్టినట్లు తెలిపారు. కాగా, వీటన్నింటికీ సభ్యులు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపారు.
అసెంబ్లీని ముట్టడించేందుకు వీఆర్ఏల యత్నం
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు ప్రయత్నించాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ మత్య్సకార విభాగం, వీఆర్ఏ, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడించేందుకు వచ్చారు. పే స్కేల్ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ నుంచి వందలాది వీఆర్ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరారు. అయితే, ట్యాంక్ బండ్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫైఓవర్ పరిసరాల్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వీరి మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఆందోళనకారులున చెదరగొట్టారు. కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ సమావేశాల్లోనే నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు కోరుతున్నారు.
అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నం, ఉద్రిక్తత, అరెస్ట్
ఇది ఇలావుండగా, మత్య్సకారుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఫిషరీస్ శాఖ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలో చేపల టెండర్లను ఏపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. తెలంగాణ మత్య్సకారులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక, రూ. 2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే, ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications