అమిత్ షా టార్గెట్ కెసిఆర్, చూపు కమ్యూనిస్టులపై ఉన్నా..: నారాయణ
తెలంగాణలో బీజేపీ.. కమ్యూనిష్టులపై దృష్టి పెట్టినట్లు పైకి కనిపిస్తున్నా... అసలు దెబ్బ మాత్రం సీఎం కేసీఆర్ను కొట్టడానికే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ.. కమ్యూనిష్టులపై దృష్టి పెట్టినట్లు పైకి కనిపిస్తున్నా... అసలు దెబ్బ మాత్రం సీఎం కేసీఆర్ను కొట్టడానికే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ భయపడి మోడీని, అమిత్ షాను ఆశ్రయిస్తారేమో? అని ఆయన అనుమానం వెలిబుచ్చారు.
ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... కమ్యూనిస్టులను ఖాళీ చేస్తామని పైకి చెబుతూ అమిత్ షా నల్లగొండపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఆయన టార్గెట్ మాత్రం టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధిపత్యం సాధించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.
అసలు బీజేపీ పట్ల.. టీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడే ముందస్తు ఎన్నికలను తెస్తున్నారన్నారు. ఒకేసారి దేశమంతటా ఎన్నికలు అనే కాన్సెప్టు బాగున్నా...ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. మోడీ ఏటీఎంలను పోగొట్టి పేటీఎంలను తెచ్చారని నారాయణ విమర్శించారు.
బీజేపీ పాలనలో దళితులపై దాడులు, గోరక్షణ పేరుతో హత్యలు అధికం అవుతున్నాయని, ప్రతిరోజూ దళిత, క్రైస్తవ, ముస్లింలపై దాడి చేస్తూ వారిని ఊచకోత కోస్తున్నారని నారాయణ మండిపడ్డారు.
ఈ దాడుల పాపభీతి పట్టుకున్నందు వల్లే తిన్నింటి వాసాలు లెక్కించే చందంగా దళితుల ఇళ్లలో అమిత్ షా భోజనం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక దళితులపై అమిత్ షాది అంతా కొంగ జపమేనని, దళితవాడలో ఆయన భోజనం పాపాలను కడుక్కోవడానికే అని వ్యాఖ్యానించారు.