ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? 'బండి'సేనకు టార్గెట్ ఫిక్స్ చేసిన అమిత్ షా!!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో నిన్న పర్యటించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో సభ కంటే ముందే అమిత్ షా బిజెపి ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అసలు ముందు షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా చేవెళ్ల బహిరంగసభకు వస్తారని బీజేపీ నేతలు చెప్పినప్పటికీ, అందుకు భిన్నంగా అమిత్ షా ఒక హోటల్ లో బీజేపీ ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించారు.
15నిమిషాల పాటు నిర్వహిస్తారు అనుకున్న మీటింగ్ 40 నిమిషాల పాటు జరిగింది. షెడ్యూల్లో లేకుండా అమిత్ షా బీజేపీ ముఖ్యనేతలతో అకస్మాత్తుగా మీటింగ్ పెట్టడం వెనుక కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్ లో అమిత్ షా తెలంగాణ బిజెపి నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే అని తేల్చి చెప్పారని సమాచారం.

బీజేపీ తెలంగాణ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిన అమిత్ షా కేసీఆర్ తో కొట్లాడి ప్రజలకు నమ్మకాన్ని పెంచుతారా? లేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి జనాలను బిజెపివైపు ఆకర్షిస్తారా? అన్నది మీరే తేల్చుకోవాలని ముఖ్య నేతలకు అమిత్ షా చెప్పారని సమాచారం. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడాలని ప్రధాని మోడీ ఆలోచనగా అమిత్ షా శ్రేణులకు దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది.
ఇప్పుడు గనుక అధికారంలోకి రాకపోతే, తర్వాత వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఎవరూ చెప్పలేరని అందరినీ గట్టిగా హెచ్చరించిన అమిత్ షా తెలంగాణాలో అధికారం చేపట్టడానికి ఇదే సరైన సమయం అన్నారని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలపైన కూడా అమిత్ షా పార్టీ నాయకులకు కీలక ఆదేశాలిచ్చారని తెలుస్తుంది.
వచ్చే ఎన్నికలలో ఇతర పార్టీలలో ఉన్న ముఖ్య నేతలను వీలైనంత మందిని బిజెపిలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరగాలని, అధికారంలోకి రావడానికి తీసుకోవలసిన అన్ని చర్యలను బీజేపీ నేతలు తీసుకోవాలని చెప్పినట్లుగా సమాచారం. ఈసారి ఎన్నికలను సిల్లీగా తీసుకుంటే కష్టమని, ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకుని అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైన కేసీఆర్ పై పోరాటం చేయాలని అమిత్ షా గట్టిగానే క్లాస్ పీకారని సమాచారం.












Click it and Unblock the Notifications