టీఆర్ఎస్-కాంగ్రెస్ మైత్రి పై అమిత్ షా చెప్పిందిదే : ఈటలకు భరోసా..!!
తెలంగాణ భవిష్యత్ రాజకీయాలపై హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ లో ఇప్పుడు రాజకీయ పోరు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా మారుతోంది. కాంగ్రెస్ స్థానం పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ.. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ అండ్ టీం చేస్తున్న ఆరోపణలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతోంది. సెప్టెంబర్ 17 అంశం పైన రెండు పార్టీలు భిన్నాభిప్రాయాలతో వేడుకలు నిర్వహించాయి.
విజయం సాధించే వరకూ విశ్రమించద్దు
కేంద్రం తొలి సారి తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించింది. ఇందులో స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించారు.
పార్టీని బూత్ కమిటీల స్థాయి నుంచి నియోజకవర్గం వరకు ప్రతీ స్థాయిలోనూ బలోపేతం చేయాలని నిర్దేశించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన, మునుగోడు ఉప ఎన్నిక, తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ స్థానాల వారీగా పార్టీ పరిస్థితి పైన నివేదికలు ఇవ్వాలని సూచించారు. బూత్ కమిటీలు పక్కాగా పనిచేయాలని నిర్దేశించారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించేలా పనిచేయాలని భేటీలో సూచించారు.
టీఆర్ఎస్ - కాంగ్రెస్ సంబంధాలపైనా
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీసారు. గతంలో నిర్దేశించిన కార్యాచరణ అమలు పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ - వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ ఇంఛార్జ్ వరకు పూర్తి స్థాయిలో నియమకాలు వెంటనే పూర్తి చేయాలని అమిత్ షా నిర్దేశించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ సంబంధాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ తెలంగాణలో ఆదరణ కోల్పోయిందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బీజేపీకి పూర్తిగా అవకాశాలు మెరుగవుతున్నాయని..అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగా పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ ఎప్పుడైనా ఒకటయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అమిత్ షా పార్టీ నేతలకు చెప్పారు.
ఈటల రాజేందర్ కు హామీ
బూత్ లెవల్ నుంచి నియోజకవర్గాల వారీగా నియామకాలు - బలోపేతం - పార్టీ వ్యూహాలు..కార్యాచరణ పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్... సంస్థాగత బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సన్ కు అమిత్ షా అప్పగించారు. ఆ తరువాత ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన సమయంలోనూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా టీఆర్ఎస్ టార్గెట్ చేసిందనే అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఆ సమయంలో తాము అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ షా హామీ ఇచ్చారు. అదే సమయంలో మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత మైలేజ్ పెరుగుుందని.. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ పార్టీ నేతలకు అమిత్ షా నిర్దేశించారు.