డైనమిక్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్రంలో కీలక హోదా: నేరుగా ప్రధానికే రిపోర్ట్..
హైదరాబాద్: తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలి డెప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. కేంద్ర కేబినెట్ కార్యాలయం డిప్యూటీ కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర అధికార సర్వీసులు, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసింది. నాలుగేళ్ల పాటు ఆమ్రపాలి కేంద్ర కేబినెట్ డిప్యూటీ కార్యదర్శిగా కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా ఉన్నారు.
అతి చిన్న వయస్సులోనే కేంద్ర కేబినెట్ కార్యాలయంలో నియామకాన్ని పొందిన ఐఎఎస్ అధికారిణిగా ఆమ్రపాలి గుర్తింపు పొందారు. కేంద్ర కేబినెట్ కార్యాలయం పర్యవేక్షణ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంటుంది. ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులందరూ నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి చోట ఆమ్రపాలి నియమితులు కావడం చెప్పుకోదగ్గ విషయమని అధికార వర్గాలు అంటున్నాయి.
2010 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆమ్రపాలి పలు చోట్ల పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం డీఓపీటీ ఆమెకు తెలంగాణ క్యాడర్ కు బదలాయించింది. ప్రారంభంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఆమెను లూప్ లైన్ లో ఉంచింది. తన బ్యాచ్ మేట్, ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్ క్యాడర్ కు చెందిన సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం, భర్త కేంద్ర సర్వీసుల్లో ఉన్న నేపథ్యంలో ఆమ్రపాలి కొంతకాలంగా కేంద్ర సర్వీసుల కోసం ప్రయత్నాలు సాగించారు. అవి సఫలం అయ్యాయని, ఏకంగా కేంద్ర కేబినెట్ కార్యాలయంలోనే చోటు దక్కడం గొప్ప విషయమని అధికారులు చెబుతున్నారు.