Texas mall shooting: షాపింగ్ మాల్ కాల్పుల్లో హైదరాబాద్ ఇంజినీర్ మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ నిత్యకృత్యమైంది. వరుస కాల్పుల ఘటనలు నమోదవుతున్నాయి. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. దీనికి బ్రేకులు పడట్లేదు. ఏదో ఒక ప్రాంతంలో తుపాకీ పేలుతూనే ఉంది. జనం ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 198 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజాగా మరోసారి అలాంటి దిగ్భ్రాంతికర ఘటనే సంభవించింది. టెక్సాస్లో మార్సియో గార్సియా అనే వ్యక్తి తుపాకీతో విరుచుకుపడ్డాడు. యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం- డల్లాస్లోని ఓ షాపింగ్ మాల్లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు- ఆ దుండగుడిని కూడా కాల్చి చంపారు. టెక్సాస్ స్టేట్లోని ఢల్లాస్ శివార్లలో గల అల్లెన్ టౌన్లో ఈ ఘటన సంభవించింది. ఇక్కడి అల్లెన్ ప్రీమియం అవుట్లెట్స్ మాల్లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. మాల్ సెక్యూరిటీ కళ్లు గప్పి తుపాకీతో లోనికి ప్రవేశించిన కొద్దిసేపటి తరువాత యథేచ్ఛగా కాల్పులు జరిపాడు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే అల్లెన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం దుండగుడు ఎక్కడ ఉన్నాడనేది పసిగట్టారు. చాకచక్యంగా లోనికి ప్రవేశించిన పోలీసులు అతణ్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది సంఘటన స్థలంలోనే మరణించారు.
మృతుల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఐశ్వర్య తాటికొండ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సిరెడ్డి కుమార్తె ఆమె. డల్లాస్ సమీపంలోని మెక్కిన్నెలో నివసిస్తోన్నారామె. ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేస్తోన్నారు. శనివారం సాయంత్రం షాపింగ్ కోసం ఆమె అల్లెన్ ప్రీమియం అవుట్లెట్స్ మాల్కు వెళ్లారు. అక్కడ జరిగిన కాల్పుల ఘటనల్లో మరణించారు.
ఐశ్వర్య స్నేహితుడొకరు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఆమె మరణించిన విషయాన్ని మెక్కిన్నె ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన ఐశ్వర్య మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లారు. అనంతరం అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేస్తోన్నారు. ఈ కాల్పుల్లో మరణించారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications