మగాడిపై గ్యాంగ్ రేప్: కాళ్లూ చేతులూ కట్టేసి నోట్లో దుస్తులు కుక్కి హత్య?
హైదరాబాద్: హైదరాబాదులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పుత్లీబౌలిలోని అమృత్ బార్ ఎదురుగా గల ఓ ఫుట్పాత్పై గుర్తు తెలియని వ్యక్తి (45) కాళ్లు, చేతులు వెనక్కి కట్టేసి నోట్లో దుస్తులు కుక్కి చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు అఫ్జల్గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. మృతుడి చేతులు, కాళ్లు వెనక్కి విరిచి కట్టి నోట్లో దుస్తులు కుక్కి లైంగిక చర్యకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పెనుగులాటలో వూపిరాడక మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఇది స్వలింగ సంపర్కులు చేసిన హత్యగా భావిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు నీలం రంగు ప్యాంటు, గోధుమ రంగు చొక్కా ధరించినట్లు, మృతుడి కుడి చేతిపై లక్ష్మమ్మ అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. అమృత్ బార్ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపం కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ చదువుతున్న ఓ విద్యార్థి వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలంలో ఆ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేట్బషీరాబాద్ సీఐ డీవీ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందిన జొరిగె రాకేష్(20) ఎన్సీఎల్కాలనీలోని శివసాయి బాలుర వసతిగృహంలో ఉంటూ కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం స్నేహితులంతా కళాశాలకు వెళ్లగా రాకేష్ మాత్రం గదిలోనే ఉన్నాడు. ఉన్న వారిని భోజనాలకు పిలిచేందుకు వసతి గృహం నిర్వాహకుడు గదుల వద్దకు వెళ్లగా లోన గడియ వేసుకొని సీలింగ్ ఫ్యాన్కు కండువాతో ఉరేసుకుని వేలాడుతున్న రాకేష్ కన్పించాడు.
పోలీసులు, అతడి స్నేహితులు వచ్చిన గది తలుపులు బద్దలుకొట్టి మృతదేహాన్ని కిందికి దించారు. సంఘటనా స్థలంలో మృతుడు రాసిన సుసైడ్నోట్ లభించింది. ''నన్ను క్షమించండి.. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నా. నిజమైన ధైర్యవంతుడిలా బతకాలని కోరుకున్నా.. కాని అలా జీవించటం నావల్ల కావట్లేదు. నా మరణానికి ఎవరూ కారణం కాదు. సహజమరణంగా భావించండని'' లేఖలో పేర్కొన్నాడు.