కొన్ని ఆంధ్ర కుక్కలు ఆడిస్తున్నాయి: జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
వరంగల్: కొన్ని ఆంధ్ర కుక్కలు ఆశా వర్కర్లను సపోర్టు చేసి ఆడిస్తున్నాయని తెలంగాణ విద్యుచ్ఛక్తి మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య చేశారు. వాస్తవానికి ఆశవర్కర్లవి ప్రభుత్వ ఉద్యోగాలు కావని, అలాంటప్పుడు ప్రభుత్వం మీ సమస్యలను ఎలా పట్టించుకుంటుందని అన్నారు. తనతో సమస్యలు విన్నవించుకున్న ఆశ కార్యకర్తలనుద్దేశించి రాష్ట్ర మంత్రి జగదీశ్వర్రెడ్డి ఆ విధంగా అన్నారు.
వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమల్ల గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి జగదీశ్వర్రెడ్డికి ఆదివారం ఆశ కార్యరక్తల నుంచి నిరసన ఎదురైంది. వారు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వేదిక వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లాలో మంత్రి పర్యటన

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం పర్యటించనున్నట్లు మంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి డీఎస్వీ శర్మ తెలిపారు. సూర్యాపేట పట్టణంతోపాటు పెన్పహాడ్ మండలాల్లో రూ.4.89కోట్లతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రూ.60లక్షలతో స్థానిక తాళ్లగడ్డలోని పశువైద్య సమాచార, ప్రదర్శనశాల కోసం నిర్మించిన భవనాన్ని ఉదయం 9:30గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. నిర్మించిన పశువైద్య శిక్షణ కేంద్రం భవనాన్ని 9:40గంటలకు, రూ.కోటి వ్యయంతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాన్ని 10గంటలకు, రూ.30లక్షలతో స్థానిక జమ్మిగడ్డలో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని 10:45గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
11గంటలకు సూర్యాపేట మండలం ఇమాంపేటలో రూ.1.28కోట్లతో నిర్మించిన మోడల్ స్కూల్ వసతి గృహాన్ని, పెన్పహాడ్ మండలం దోసపహాడ్ వద్ద సాగర్ ఎడమ కాలువపై రూ.1.11కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications