'డీజీపీ'పై బాబు పంతం: కేంద్రంపై అసంతృప్తి, పోలీస్ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
అమరావతి: ఏపీలో కొత్త డీజీపీ నియామకానికి రూట్ క్లియర్ అయింది. ఏపీ పోలీస్ యాక్టులో సవరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా, గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఏపీ పోలీస్ యాక్ట్ 2014 సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీ ప్రభుత్వమే డీజీపీగా నియమించుకునేందుకు మార్గం సుగమం అయింది.

కేంద్రం తీరుతో విసిగిపోయి
డీజీపీ నియామకం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం విసిగిపోయిందని అంటున్నారు. ఇకపై రాష్ట్ర డీజీపీని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకునేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది.

ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీం తీర్పును అనుసరించి
గతంలో ప్రకాశ్ సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి అనేక రాష్ట్రాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా డీజీపీ ఎంపిక ప్రక్రియను చేపడుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ పోలీస్ యాక్ట్కు సవరణ చేసి యూపీఎస్సీ కమిటీ ద్వారానే డీజీపీ నియామకం జరగాలని క్లాజ్ చేర్చారు.

డీజీపీ సాంబశివ రావు విషయంలో కేంద్రం తీరుపై
ప్రస్తుత డీజీపీ సాంబశివ రావు విషయంలో కేంద్ర హోంశాఖ తీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ప్యానెల్లో ఎవరి పేరు పెట్టాలో, ఎవరి పేరు పెట్టకూడదో కేంద్రమే నిర్ణయిస్తే ఎలా? రాష్ట్రం సూచించిన పేర్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేయడమే యూపీఎస్సీ కమిటీ విధి.

నాటి క్లాజ్ ఉపసంహరణ
కేంద్ర హోంశాఖ దీనికి ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం 2014లో తెచ్చిన సవరణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టికల్ 348/3 ప్రకారం 2014 పోలీస్ యాక్ట్కు సవరణ చేస్తూ 2017 పోలీస్ యాక్ట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు.












Click it and Unblock the Notifications