బాబుకు చండీమాత విగ్రహ బహూకరణ, కెసిఆర్ను మెచ్చుకున్న సుజనా
మెదక్: అయుత చండీయాగంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చండీమాత విగ్రహాన్ని బహూకరించారు. ఆదివారం నాడు చంద్రబాబు యాగంలో పాల్గొన్నారు. యాగం గురించి చంద్రబాబుకు కేసీఆర్ వివరించారు.
యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన చంద్రబాబు.. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నుంచి తెచ్చిన కానుకలను హోమగుండంలో సమర్పించారు. అనంతరం చంద్రబాబును కెసిఆర్ శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత చండీమాత విగ్రహాన్ని బాబుకు బహుకరించారు. బాబు సంప్రదాయ దుస్తులు ధరించి యాగంలో పాల్గొన్నారు.
కాగా, లోకకల్యాణం కోసం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ మహాయాగం చివరి రోజైన ఆదివారం వైభవోపేతంగా కొనసాగుతుంది. ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పసుపు వర్ణం దుస్తులు ధరించి చండీయాగంలో పాల్గొన్నారు. రుత్విజుల మంత్రోచ్ఛరణాల మధ్య యాగం జరిగింది.
కెసిఆర్ బాగా చేస్తున్నారు: సుజనా చౌదరి
తెలుగు ప్రజల సుఖశాంతుల కోసమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆదివారం అన్నారు. చండీయాగానికి హాజరైన ఆయన తిరిగి వెళ్లే సమయంలో మాట్లాడారు.
తరుచూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్లు కలవడం శుభపరిణామం అని చెప్పారు. ఇది తమకూ సంతోషం కలిగిస్తోందన్నారు. ఇద్దరు సీఎంలు చక్కగా కలిశారన్నారు. కెసిఆర్ అద్భుతంగా యాగం చేస్తున్నారని కితాబిచ్చారు.
ఆయుత చండీయాగం నేపథ్యంలో జాగ్రత్తలు బాగా తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చండీయాగం చేయడంపై స్పందిస్తూ... ఎవరి నమ్మకాలు వారివని, ఎవరి మతం పట్ల వారికి ఓ అభిప్రాయం ఉంటుందని, రాజకీయాలకు యాగానికి సంబంధం లేదని చెప్పారు.