'ఏపీ సైట్ హ్యాక్ చేసి.. సైబర్ క్రైంకు పాల్పడిన తెలంగాణ, కేసు పెడ్తాం'
విజయవాడ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గొడవ ముదురుతోంది. కాపీ చేశారని తెలంగాణ ప్రభుత్వం తమ పైన కేసు పెట్టడంపై ఏపీ టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. అసలు తమ సైట్ను కాపీ కొట్టిన తెలంగాణ ప్రభుత్వం పైన తాము కేసు పెడతామని ఏపీ టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు.
టిడిపి నేత చందు సాంబశివ రావు గురువారం నాడు మాట్లాడుతూ.. తాము కాపీ కొట్టామని తెరాస నాయకులు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని చెప్పారు. తమ సైట్ను హ్యాకింగ్ చేసి సైబర్ క్రైంకు పాల్పడిన తెలంగాణ ప్రభుత్వం పైన కేసు పెడతామన్నారు. అయినా తెలంగాణ మంత్రులకు చంద్రబాబును ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదన్నారు.
కాగా, తెలంగాణ వెబ్ పోర్టల్, ఏపీ వెబ్ పోర్టల్ రెండూ వేర్వేరని, సర్వర్ను కాపీ చేయడం ఎలా సాధ్యమని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం నాడే చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్ సైట్ను కాపీ చేశారంటూ తెలంగాణ ఫిర్యాదు చేయగా, ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ పోర్టల్లో ఇప్పటి వరకు తొమ్మిది వేల లావాదేవీలు జరిపామమన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదు చేయలేదని, చవకబారు ఆరోపణలపై దృష్టి సారించబోమన్నారు.
కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తాము నిరూపించామన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
ఏపీ అప్ లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు ఎలా తెలిసిందని, వెబ్ పోర్టల్లో సమాచారం రహస్యంగా ఉంటుందని, మా వెబ్ పోర్టల్ను మీరు హ్యాక్ చేశారా అని ప్రశ్నించారు. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి రెండో స్థానం లభించిందని, ఈ ఏడాది తొలిస్థానం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీపై తెలంగాణ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను రెండో స్థానంలో ఉన్న ఏపీ ఎందుకు కాపీ కొడుతుందని ఎద్దేవా చేశారు. వెబ్ సైట్ను గమనించకుండా కేసులు పెట్టి, లేఖలు రాసి తెలంగాణ మంత్రి కేటీఆర్ నవ్వులపాలయ్యారన్నారు.