తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్: సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వ డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు.. అదే సమయంలో కొత్త డీజీపీ అంజనీకుమార్కు స్వాగతం పలికారు.
బీహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీకుమార్.. పాట్నాతోపాటు ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ శాఖలో మంచి హోదాలలో పనిచేశారు. ఆయనకు పలు అవార్డులు కూడా దక్కాయి.
ఐక్యరాజ్యసమితి శాంతి మెడల్ రెండుసార్లు అందుకున్నారు. హైదారాబాద్ సిటీ పోలీసుల 500 ఏళ్ల చరిత్రపై పుస్తకంలోనూ తన భాగస్వామ్యాన్ని అంజనీకుమార్ అందించడం గమనార్హం. హైదరాబాద్ సీపీగా కూడా ఆయన పనిచేశారు. అంజనీకుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అంజనీకుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ప్రగతిభవన్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. డీజీపీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. అంజనీకుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ఇలావుండగా, రాచకొండ కొత్త సీపీగా దేవేందర్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న సీపీ మహేశ్ భగవత్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మహేశ్ భగవత్ను ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ సీఐడీ డీజీగా బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో దేవేందర్ సింగ్ చౌహాన్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు.