చక్రి భార్యకు ఝలక్!: రోజుకో మలుపు తిరుగుతున్న ఆస్తుల వివాదం
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి సోదరుడు మహిత్ నారాయణకు మద్దతుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఆందోళన చేపట్టారు.
గురువారం రాత్రి చక్రి సోదరుడు మహిత్ అరెస్టుకు నిరసనగా వారు.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇంట్లో అద్దెకుంటున్న వారిని ఖాళీ చేయించి చక్రి సోదరుడికి అప్పగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
కాగా, చక్రి కుటుంబ సభ్యులు.. తల్లి, సోదరుడు నాలుగు రోజులుగా సోమాజిగూడలోని విల్లా వద్దనే బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు నిన్న మాట్లాడుతూ... తాము కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని చెప్పారు. అన్నీ ఆస్తులు తన కోడలు పేరుమీదే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె లక్షలు, కోట్లు తీసుకు వెళ్లిపోయిందన్నారు. మాకు ఇక్కడ ఏం లేకుండా పోయిందన్నారు. ఇంత దుర్మార్గం ఏ కోడలు చేయదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటామని, చచ్చేదాకా ఉంటామన్నారు. తనకు ఇప్పుడు పెన్షనే ఆధారమని చెప్పారు.
ఆస్తులు అన్నీ తన కోడలు పేరు మీదే ఉన్నాయని చెప్పారు. చక్రి సోదరుడు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తి ఉందని చెప్పారు. అన్నయ్య చనిపోయాక.. ఏం సంపాదించలేదని చెప్పారని కాని చాలా ఆస్తి ఉందని చెప్పారు. తమకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పారు.
అందుకోసమే తన తల్లి పోరాడుతోందన్నారు. మొయినాబాదులో, సోమాజిగూడలో, శామీర్ పేటలో, శంషాబాదులో ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరులో అయిదెకరాల పొలం ఉందని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లాట్ను అమ్మేసుకున్నారని, ఓ ఆడి కారు ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయనను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.