వావ్ అమరావతి: కెసిఆర్-బాబు 20 ని.లు సీక్రెట్ ముచ్చట్లు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఆదివారం సాయంత్రం 55 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బయట అందరిముందు 30 నిమిషాలు మాట్లాడుకున్న చంద్రబాబు, కెసిఆర్లు... ఆ తర్వాత 25 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
అనంతరం ఇద్దరూ బయటకు వచ్చారు. చంద్రబాబు తిరిగి వెళ్లే సమయంలో కెసిఆర్ వాహనం వద్దకు వచ్చి వీడ్కోలు పలికారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు కెసిఆర్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు బేగంపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. కెసిఆర్ అమరావతికి రండి అని చంద్రబాబు చెప్పగా, కెసిఆర్ అన్నా అంటూ బాబును పలకరించారు.
చంద్రబాబు రాగానే కెసిఆర్ బయటకు వచ్చి లోపలకు తీసుకు వెళ్లారు. కెసిఆర్కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇవ్వగా, కెసిఆర్ను చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. ఇద్దరు సీఎంల మధ్య భేటీ జరగడం ఎనిమిది నెలల తర్వాత ఇదే ప్రథమం. చివరిసారిగా గత ఫిబ్రవరిలో రాజ్ భవన్లో వీరిద్దరు సమావేశమయ్యారు.
చంద్రబాబు - కెసిఆర్
కెసిఆర్కు శాలువా కప్పి ఆహ్వాన పత్రికతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని చంద్రబాబు అందించారు. తెలంగాణ నుంచి పుణ్యజలాలు, మట్టి తేవాలన్న చంద్రబాబు తెలంగాణ సీఎంను కోరారు. అందుకు కెసిఆర్ సరేనని చెప్పారు. తాను రోడ్డు మార్గంలో వస్తానన్న కెసిఆర్ చెప్పారు.
చంద్రబాబు - కెసిఆర్
చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణ విశేషాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక రిడార్కు చంద్రబాబు సూచన చేయగా, అందుకు కెసిఆర్ అంగీకారం తెలిపారు. అమరావతికి రావాలన్న చంద్రబాబు స్వాగతానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. శంకుస్థాపనకు వస్తానని తెలిపారు.
చంద్రబాబు - కెసిఆర్
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు 55 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు ఆదివారం రాత్రి 6.35 గం.ల.కి కేసీఆర్ అధికార నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబు - కెసిఆర్
ఆయన వెంట తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర రావులున్నారు. సతీసమేతంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని చంద్రబాబు కోరారు. మిఠాయిలు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూల ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఇద్దరూ మాట్లాడుకున్నారు.
అమరావతికి ఎలా వస్తారు?
అమరావతికి ఎలా వస్తారు.. హెలికాప్టర్లోనా లేక విమానంలోనా అని కేసీఆర్ ప్రయాణం గురించి చంద్రబాబు ప్రశ్నించారు. 21న తేదీన తాను సూర్యాపేటలో రెండు పడకగదుల ఇళ్ల శంకుస్థాపన, స్టేడియం ప్రారంభోత్సవం కార్యక్రమాలలో పాల్గొంటున్నానని, ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి, 22న రోడ్డు మార్గంలో అమరావతికి వస్తానని కేసీఆర్ చెప్పారు.
పుణ్యక్షేత్రాల నుంచి మట్టి - నీరు
అమరావతి నిర్మాణానికి తెలంగాణలోని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీరు తేవాలని చంద్రబాబు కోరగా కేసీఆర్ అంగీకరించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ విశేషాలను కేసీఆర్కు బాబు వివరించారు. బృహత్ ప్రణాళికతో అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామన్నారు.
చంద్రబాబుకు కెసిఆర్ ప్రశంస
ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లో ఒకటిగా ఉంటుందని, దేశానికి గర్వకారణంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వివరించారు. నదీతీరంలోని అమరావతి రాజధాని నిర్మాణానికి చక్కటి ప్రదేశమని, వాస్తురీత్యా అత్యంత అనుకూల ప్రాంతమని కేసీఆర్ చెప్పారు. కొత్త రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు బాగా చేస్తున్నారని ప్రశంసించారు.
బాబుకు సూచన
ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున అదనంగా మరో 500 ఎకరాల్లో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ చెప్పగా... వేయి ఎకరాలను సిద్ధం చేస్తున్నామని బాబు వెల్లడించారు. భద్రత కారణాల వల్ల కొద్ది మంది వీఐపీలను మాత్రమే పిలుస్తున్నామని బాబు చెప్పగా, ప్రధాని పర్యటన దృష్ట్యా ఎస్పీజీ భద్రత అనివార్యమని కేసీఆర్ అన్నారు. శంకుస్థాపన ప్రాంతాన్ని ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుందని బాబు వివరించారు. అమరావతిలో వేయి ఎకరాల్లో మంత్రులు, అధికారుల నివాస గృహాలను నిర్మించాలని కేసీఆర్ సూచించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్
అమరావతి-హైదరాబాద్- ముంబై, అమరావతి-హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తే ఏపీ, తెలంగాణల అభివృద్ధికి దోహదపడుతుందని, ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదిద్దామని చంద్రబాబు చెప్పగా కేసీఆర్ అంగీకరించారు.
జల రవాణా
జల రవాణా అంశమూ చర్చించారు. త్వరలో కేంద్రమంత్రి గడ్కరి తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనతో జల రవాణా గురించి చర్చిస్తామని కేసీఆర్ చెప్పారు. నదుల అనుసంధానం అవసరమని చంద్రబాబు చెప్పగా, ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భేషుగ్గా విద్యుత్
విద్యుత్ పరిస్థితుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. ఇటీవల కేటీఆర్ ఉత్తరప్రదేశ్కు వెళ్లగా అక్కడ విద్యుత్ పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు గుర్తించారని కేసీఆర్ చంద్రబాబుతో చెప్పారు. పలు రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయని, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని వెల్లడించారు.
చంద్రబాబు - కెసిఆర్
అప్పట్లో మనం విద్యుత్ సంస్కరణలు చేపట్టాం... దాని ఫలితాలను ఇప్పుడు రెండు రాష్ట్రాలు పొందుతున్నాయని చంద్రబాబు తెలిపారు. సింగపూర్, జపాన్, దుబాయ్లలో వనరులను సమర్థంగా వినియోగించుకుంటారని, అందుకే ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందాయని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు - కెసిఆర్
వరంగల్ జిల్లాలోని రేయాన్స్ పరిశ్రమ మూతపడి, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిశ్రమను తెరిపించేందుకు ఇద్దరు సీఎంలు సహకరించాలని ఎర్రబెల్లి, రమణలు కోరారు. ఇప్పటికే దాని కోసం కొన్ని ప్రయత్నాలు చేశామని, మరింత కృషి చేస్తామని కేసీఆర్ అన్నారు.
చంద్రబాబు - కెసిఆర్
ఆహ్వాన పత్రిక అందిందా అని చంద్రబాబు అక్కడే ఉన్న కేటీఆర్ను అడగగా... అందింది అంకుల్ అంటూ ఆయన సమాధానమిచ్చారు. ఏకాంతంగా భేటీబయట అందరి ముందు 30 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు సీఎంలు ఆ తర్వాత ఏకాంతంగానూ సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ ముఖాముఖి జరిగింది. అనంతరం ఇద్దరూ బయటికి వచ్చారు.
చంద్రబాబు - కెసిఆర్
చంద్రబాబు తిరిగి వెళ్లే సమయంలోనూ కేసీఆర్ ఆయన వాహనం వద్దకు వచ్చి వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న అమరావతిలో ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళ్తున్నందున అదే రోజు హైదరాబాద్లో జరగాల్సిన ఐడీహెచ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు వాయిదా పడనున్నాయి.
చంద్రబాబు - కెసిఆర్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఐడీహెచ్ కాలనీఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేదలకు రెండు పడకగదుల ఇళ్లను నిర్మించింది. ఈ నెల 22న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇంకా కొన్ని పనులు పూర్తికానందు వల్ల మరో రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.