ఎపికి కేటాయించిన సెక్రటేరియట్ భవనాలను అప్పగించేందుకు సానుకూలంగా స్పందించిన ఎపి
హైదరాబాద్: రోగి కోరుకొన్నట్టుగానే వైద్యుడు చికిత్స అందించాడు అనే నానుడి మనందరికీ గుర్తుండే ఉంటుంది. హైద్రాబాద్ లోని సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.తెలంగాణ కోరిందే తడవుగా ఈ భవనాలను అప్పగించేందుకు ఎపి ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది..ఎపి ప్రభుత్వం నుండి సానుకూలంగా నిర్ణయం రావడంతో కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేయనుంది.
ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి...దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ భావిస్తున్నారు.ఈ సచివాలయంలోని ఎ, బి , సి ,డి బ్లాక్ లు తెలంగాణకు, మిగిలిన బ్లాక్ లను ఎపి కి కేటాయించారు.అయితే అమరావతి నుండి ఎపి పాలన సాగుతోంది.హైద్రాబాద్ లో ని సచివాలయంలోని భవనాలు ఎపి ప్రభుత్వానికి అవసరం లేవు. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎపి నిర్ణయం కొంత ఆశలను కలిగించింది.
ఎపికి కేటాయించిన భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ ఇటీవల రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ను కలిసి విన్నవించారు.శుక్రవారం నాడు విజయవాడలో ఎపి ముఖ్యమంత్రితో సమావేశమైన గవర్నర్ నరసింహాన్ ఈ విషయమై చంద్రబాబుతో చర్చించారు.చంద్రబాబు కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించారు.అయితే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు.రెండు రోజుల క్రితమే ఎపి క్యాబినెట్ సమావేశం ముగిసింది.వచ్చే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు జనచైతన్య యాత్రల నిర్వహాణ ఇతర అంశాలపై చర్చించేందుకు విజయవాడలో సమావేశమైన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో కూడ సచివాలయ భవనాల అప్పగింత అంశం చర్చకు వచ్చింది.పొలిట్ బ్యూరో లో మెజార్టీ సభ్యులు ఎపికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని సూచించారు.ఈ భవనాలను ఎపి ప్రభుత్వం అప్పగిస్తే....22 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్లాన్ సిద్దం చేయనుంది.ఈ విషయమై మంత్రివర్గసమావేశంలో కూడ చర్చించింది..