తెలంగాణ రాజకీయాలపై మంత్రి నారా లోకేష్, పొత్తులపై స్పందన
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని చెప్పారు. తెలంగాణలో పొత్తులపై పార్టీ పొలిట్ బ్యూరోదే తుది నిర్ణయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము అన్ని స్థానాలలో పోటీ చేస్తామని చెప్పారు.
హుస్నాబాద్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
హుస్నాబాద్లో ఈ నెల 7వ తేదీన కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు వేరుగా పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 7న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ సభకు 65 వేలమందిని సమీకరించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం నుండి 15వేలు, ఎల్కతుర్తి నుండి 6వేలు, భీమదేవరపల్లి నుండి 10వేలు, అక్కన్నపేట్ మండలం నుండి 10వేలు, కోహెడ మండలం నుండి 10 వేలు, సైదాపూర్ మండలం నుండి 10వేలు, చిగురుమామిడి మండలం నుండి 6 వేలమందిని సభకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
ఈ మేరకు 5, 6 తేదీల్లో మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తెలిపారు. హుస్నాబాద్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుందని, ఆ సభకు పలు గ్రామాల నుంచి పాదయాత్రల ద్వారా రావాలని పిలుపునిచ్చారు. గిరిజన నృత్యాలు, మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు.