‘బాబూ అరాచకం సృష్టిస్తే ఊరుకోం! ఏపీ పోలీసులతో డబ్బులు పంచుతావా?: రాహుల్తో రూ.500కోట్ల డీల్’
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచేందుకు చంద్రబాబు తెరతీశారన్నారు.
డబ్బులు పంచుతున్న ఏపీ పోలీసులు
ధర్మపురిలో తమ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. కొందరు డబ్బులతో దొరికారని, తీరా వారు ఏపీ పోలీసులని తెలిసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం ఏపీ ఇంటలిజెన్స్ను చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి.
ఈసీ చర్యలు తీసుకోవాలి..
‘తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. మీడియాకు చెప్పిన వారిని స్థానిక యువకులు గట్టిగా ప్రశ్నిస్తే తాము ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులమని వారు చెప్పారు' అని కేటీఆర్ తెలిపారు. శుక్రవారం సర్వే చేసిన ఏపీ పోలీసుల వివరాలన్నీ తమతో ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బాబూ.. అరాచకాలు చేస్తూ ఊరుకోం
పార్టీలకు అతీతంగా ప్రతీ నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ వాహనాలను కూడా తనిఖీ చేయాలన్నారు. తెలంగాణలో పైసలు పంచడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణలో అరాచకానికి చంద్రబాబు పూనుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు కేటీఆర్. ఏపీ పోలీసులు తెలంగాణలో డబ్బులు పంచుతూ పట్టుబడితే.. తమ కార్యకర్తలెవరైనా ఆవేశంలో దాడులు చేస్తే మాత్రం తమ బాధ్యత కాదని స్పష్టం చేశారు.
రూ. 500కోట్లతో రాహుల్తో బాబు ఒప్పందం
‘ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారు. ఏపీ ప్రజల సొమ్ములతో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడి పైసలతో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. 500 కోట్లతో చంద్రబాబు.. రాహుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ లేదు. ఉత్తమ్ కుమార్రెడ్డి గత ఎన్నికల్లో ఆయన ఇన్నోవా కారులో రూ.3 కోట్లు కాల్చుకున్నాడు. చిల్లర మల్లర రాజకీయాల కోసం పోలీసులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఏపీ పోలీసులు డబ్బు పంచడంపై ఈసీకి ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ను టీఆర్ఎన్ నాయకులు పల్లా రాజేశ్వర్రెడ్డి, గట్టు రామచంద్రరావు కలిశారు. అనంతరం పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ‘ప్రతిపక్షనేతలు విచిత్రమైన ప్రతిపాదనలు చేస్తున్నారు. తమ వాహనాలను తనిఖీ చేయవద్దని ఈసీకీ ఫిర్యాదు చేసి అధికారులును బెదిరిస్తున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన నేతల వాహనాల్లోనే గతంలో డబ్బులు పట్టుబడింది. ఎన్నికల సమయంలో ఎవరి వాహనాలనైనా పోలీసులు తనిఖీలు చేస్తారు. ఏపీ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలే ఏపీ నేతలకు బుద్ది చెబుతారు' అని తెలిపారు. కాగా, తెలంగాణలో ఏపీకి చెందిన ఆరుగురు ఇంటెలిజెన్స్ పోలీసులు సంచరిస్తున్నట్లు గుర్తించామని రజత్ కుమార్ వెల్లడించారు. దీనిపై విచారిస్తున్నామని తెలిపారు.