చంద్రబాబు ఆడియోపై టీ న్యూస్కు ఎపి పోలీసుల నోటీసు జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆడియో టేపుల లీక్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందడుగు వేశారు. టీ న్యూస్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు టీ న్యూస్కు నోటీసులు అందజేశారు.
ఈనెల 7వ తేదీన చంద్రబాబు-స్టీఫెన్సన్ మధ్య జరిగిన సంభాషణ ‘టీ-న్యూస్'లోనే మొట్టమొదటిసారిగా ప్రసారమైంది. దీనిపై విశాఖపట్నంలో ఎన్వీవీ ప్రసాద్ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, టీ-ఏసీబీ అధికారులు, సాక్షి, టీన్యూస్ చానళ్లు ప్రయత్నిస్తున్నాయి' అని ఈ ఫిర్యాదులో ఆరోపించారు.

ఆ ఫిర్యాదుపై శుక్రవారం రాత్రి 11.45 గంటలకు విశాఖపట్నం ఏసీపీ రమణ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టీ-న్యూస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా చానల్ కార్యాలయంలోకి వెళ్లారు. చానల్ సీఈవో నారాయణ రెడ్డికి నోటీసులు అందించారు.
కేబుల్ నెట్వర్క్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం నోటీసు జారీ చేస్తున్నాం. మీ చానల్ ప్రోగ్రామ్ కోడ్ను ఉల్లంఘించింది. పరువు నష్టం కలిగించేలా తప్పుడు, అర్ధసత్యాలతో కూడిన కథనాలను ప్రసారం చేసింది. ఈనెల 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు మీ చానల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వగలరు' అని నోటీసుల్లో ఆదేశించారు.
నోటీసులు ఇచ్చిన వెంటనే ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టీ-న్యూస్ సిబ్బంది తమ నిరసన తెలిపారు. ‘నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి. చంద్రబాబు డౌన్ డౌన్' అని నినాదాలు చేశారు.
తెలంగాణ సిఎం కెసిఆర్పై నమోదైన కేసులపై డీఐజీ మహ్మద్ ఇక్బాల్ నేతృత్వంలో చిత్తూరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలతో కూడిన సిట్ శుక్రవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీ-న్యూస్కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications