బస్ భవన్ లో ఏపీ,తెలంగాణా ఉన్నతాధికారుల భేటీ .. అంతరాష్ట్ర రవాణాపై సీఎం కేసీఆర్ మెలిక.. ఉత్కంఠ !!
కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా నిలిపివేశాయి. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు రవాణా అప్పటి నుండి ఇప్పటి వరకూ కొనసాగలేదు. అంతరాష్ట్ర రవాణాపై సీఎం కేసీఆర్ మెలిక పెట్టారు. కొంతకాలంగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల పునరుద్ధరణపై ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు నేడు తుది దశకు చేరుకున్నాయి.
సెప్టెంబర్ నుండి అంతా అన్ లాక్... అంక్షల ఎత్తివేతకు కేంద్రం సన్నద్ధం .. ట్విస్ట్ ఏంటంటే..
హైదరాబాద్ బస్ భవన్ లో తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చలు
హైదరాబాద్ బస్ భవన్ లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటీకి ఏపీఎస్ఆర్టీసీ నుండి ముగ్గురు ఈడీలు ,ఆపరేషన్ హెడ్ బ్రహ్మానంద రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఏపీ అధికారులు బస్సు సర్వీసులను ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అన్ లాక్ లో భాగంగా బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇవ్వగానే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సేవలు పునరుద్ధరించాలని ఏపీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మరోమారు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
అంతరాష్ట్ర రవాణానే ఏకైక అజెండాగా జరుగుతున్న చర్చలు
అంతర్ రాష్ట్ర రవాణానే ఏకైక అజెండాగా ఈ చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ నుండి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ఏయే రూట్లలో ఎన్ని కిలోమీటర్ల మేర నడుస్తున్నాయి . అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బస్సులు ఎన్ని నడుస్తున్నాయి, అంతర్ రాష్ట్రాల మధ్య ఏయే రూట్ లలో ఎన్ని కిలోమీటర్ల మేర నడుస్తున్నాయి అనేవి ప్రధానంగా చర్చిస్తున్నారు. గతంలో సమావేశమైన సందర్భంగా సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు సమంగా నడపాలని, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల మేర తిరిగేలా ఒప్పందం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఏపీ డిపోల బస్సులే ఎక్కువ
రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పరిధిలోని డిపోల బస్సులు ఎక్కువగా తిరిగేవి. అదే ఆంధ్రా పరిధిలో తెలంగాణ ప్రాంత డిపోల బస్సులు తక్కువగా తిరిగేవి. అందుకు కారణం లేకపోలేదు . తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు , ముఖ్యంగా హైదరాబాద్ లోని సెటిలర్స్ ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు . కానీ తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు ఆంధ్రా లో పెద్దగా లేకపోవటంతో తెలంగాణాలోని బస్సు సర్వీసులు ఏపీలో పెద్దగా నడిచేవి కాదు .
ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు సమానంగా నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశం
రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీనివల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం వస్తోందని ఇటీవల అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య సమానంగా బస్సు సర్వీసులు నడిపేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . గతంలో సీఎం కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణ అధికారులు విజయవాడ వెళ్లి ఏపీ అధికారులతో సమావేశమైనా చర్చల్లో క్లారిటీ రాలేదు. ఆ తర్వాత కరోనా నేపధ్యంలో చర్చలు వాయిదా పడ్డాయి.
సమానంగా బస్సులు నడపటానికి ఇరు రాష్ట్రాలు ఓకే అంటాయా?
ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అన్ని పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది.ఇప్పుడు తాజాగా మరో మారు బస్ భవన్ లో చర్చలు జరుగుతున్నాయి. అంతరాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు ఏ విధంగానూ ఆటంకం కలిగించవద్దని తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాపై స్పష్టత రానుంది. మరి సమంగా బస్సులు నడిపేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలుపుతాయో లేదో నేడు తేలనుంది .