జగన్ దాదాగిరికి జోగులాంబతో చెక్ -కృష్ణా నదిపై తెలంగాణ బ్యారేజీ తథ్యం -ఏపీకి టీ మంత్రి వార్నింగ్
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న వివాదాలను మరో స్థాయికి తీసుకెళుతూ కేసీఆర్ సర్కారు భారీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకునేలా కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని కేబినెట్ ఇదివరకే నిర్ణయించడం, కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. ఏపీలో జగన్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పోటీగా కేసీఆర్ తలపెట్టిన జోగులాంబ బ్యారేజీపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాజాగా మరో ప్రకటన చేశారు..

కృష్ణా నదిపై బ్యారేజీ తథ్యం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీతో జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై జోగులాంబ బ్యారేజీ నిర్మిస్తామ, దీనికి సంబంధించి, అధికారులు త్వరలోనే సర్వే చేపడుతారని మంత్రి తెలిపారు. కృష్ణా జలాల కేటాయింపులను పూర్తి స్థాయిలో వాడుకునేలా, నికర జలాల సామర్థ్యానికి లోబడే జోగులాంబ బ్యారేజీని నిర్మిస్తామన్నారు.

అసలేంటీ జోగులాంబ బ్యారేజీ?
శ్రీశైలం వెనక భాగంలో కృష్ణానదిలో తుంగభద్ర కలిసే ప్రదేశానికి ఎగువన 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ బ్యారేజిని నిర్మించాలన్న ప్రతిపాదనకు తెలంగాణ కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలిపింది. భీమానది కృష్ణాలో కలిసేచోట నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద రోజుకు ఒక టీఎంసీ నీటిని మళ్లించేలా భీమా వరద కాలువ.. సుంకేశుల బ్యారేజి వెనుక అలంపూర్, గద్వాల ప్రాంతంలోనూ, ఆర్డీఎస్, నెట్టెంపాడు కింద నీరందని ప్రాంతం కలిపి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా ఎత్తిపోతల పథకం చేపట్టనుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా కొత్త రిజర్వాయర్లు, ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు. .ఉమ్మడి నల్గొండలోని ఎగువ ప్రాంతంలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం లక్ష్యంగా పులిచింతల ప్రాజెక్టు వెనకభాగం నుంచి ఎత్తిపోతల పథకం.. సాగర్ చివరి ఆయకట్టు, గ్యాప్ ఆయకట్టు లక్ష ఎకరాలకు నీరందించేందుకు నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయించింది. కాగా,

జగన్ దాదాగిరికి జోగులాంబతో చెక్
ఏపీ జలదోపిడీపై మంత్రి నిరంజన్ రెడ్డి కొద్ది రోజుల కిందట కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది నీటి వాటాపై తెలంగాణకు సర్వహక్కులున్నాయని, దీనిపై జగన్ సర్కారు దాదాగిరి చెల్లదని, ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు, తెలంగాణ సక్రమ ప్రాజెక్టులకు పొంతనలేదని, దబాయింపు మాటలు ఇప్పుడు చెల్లుబాటు కావని హెచ్చరించారు. కృష్ణా జలాల కేటాయింపులను ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు సంపూర్ణంగా వాడుకుంటాయని, కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీని తమ ప్రభుత్వం నిర్మించి తీరుతుందని ఉద్ఘాటించారు. మంత్రి తాజా ప్రకటనలో జోగులాంబ బ్యారేజీ సర్వే కూడా మొదలుకానున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications